ఇంగ్లండ్తో జరుగుతున్న ఆఖరి టెస్ట్లో భారత్ బౌలర్లు తొలి ఇన్నింగ్స్లో చెలరేగిపోయారు. ఏడువికెట్లు పడగొట్టి స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించారు. సీరిస్ గెలుపుతో మంచి ఊపు మీదుంటుందనుకున్న ఆతిథ్య జట్టు బ్యాటింగ్లో తడబడింది. అలిస్టర్ కుక్, మొయిన్ ఆలీలు అర్ధశతకాలతో రాణించినా 198 పరుగులకే కీలక వికెట్లు కోల్పోయింది.
తొలి రెండు సెషన్లలోనూ నిరాశపరిచిన భారత బౌలర్లు మూడో సెషన్లో విజృంభించి ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టారు. దీంతో ఈరోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు 198/7తో నిలిచింది. కెరీర్లో చివరి టెస్టు ఆడుతున్న ఓపెనర్ అలిస్టర్ కుక్ (71: 190 బంతుల్లో 8×4) అర్ధశతకంతో రాణించగా.. మొయిన్ అలీ (50: 170 బంతుల్లో 4×4) టీమిండియా సహనాన్ని పరీక్షించాడు. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ మూడు, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు పడగొట్టారు.
మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లు అలిస్టర్ కుక్, జెన్నింగ్స్ (23) తొలి వికెట్కి 60 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభాన్ని ఇచ్చారు.
టీ విరామం తర్వాత మూడో సెషన్లో భారత బౌలర్లు చెలరేగారు. జట్టు స్కోరు 133 వద్ద అలిస్టర్ కుక్ని జస్ప్రీత్ బుమ్రా బుట్టలో వేయగా.. ఆ తర్వాత వచ్చిన జోరూట్ (0), బెయిర్స్టో (0)లను బుమ్రా, ఇషాంత్ శర్మ కనీసం ఖాతా కూడా తెరవనీయలేదు. దీంతో.. 134/4తో ఇంగ్లాండ్ జట్టు ఒత్తిడిలో పడిపోయింది. కాసేపు క్రీజులో నిలిచిన బెన్స్టోక్స్ (11), భారత్కి సిరీస్లో కొరకరాని కొయ్యగా మారిన కుర్రాన్ (0)తో పాటు మొయిన్ అలీ కూడా ఓవర్ల వ్యవధిలో పెవిలియన్ చేరిపోవడంతో మెరుగైన స్కోరు చేసేలా కనిపించిన ఇంగ్లాండ్ ఒక్కసారిగా ఒత్తిడిలో కూరుకుపోయింది. ప్రస్తుతం జోస్ బట్లర్ (11 బ్యాటింగ్), ఆదిల్ రషీద్ (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. భారత్ బౌలర్లలో ఇషాంత్ శర్మ మూడు వికెట్లు పడగొట్టగా బుమ్రా, జడేజా చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.