శ్రీలంకలో రాజకీయ సంక్షోభం ముదిరి పాకాన పడింది. ప్రధాని కుర్చీ కోసం.. రాణిల్ విక్రమసింఘే.. మహింద రాజపక్సే మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. దీంతో దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వివాదం నడుస్తుండగానే ఆదివారం జరిగిన కాల్పుల కేసులో మాజీ మంత్రి అర్జున రణతుంగను పోలీసులు అరెస్ట్ చేసిన అనంతరం కోర్టులో హజరు పరిచారు.
దేశ పార్లమెంట్ను అధ్యక్షుడు సిరిసేన రద్దు చేయడంతో మంత్రులంతా పదవి కోల్పోయారు. ఐనప్పటికీ మంత్రులు మాత్రం తమ అధికారిక నివాసాలను ఖాళీ చేసేందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆయన ఇంటిముందు రాజపక్స, సిరిసేన మద్దతుదారులు ఆందోళన చేశారు. అంతేకాదు రణతుంగను నిర్బంధించేందుకు ప్రయత్నంచేశారు. దాంతో వారిని చెదరగొట్టేందుకు ఆయన సెక్యూరిటీ సిబ్బంది కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఒకరు చనిపోగా మరో ఇద్దరు గాయపడ్డారు.
ఈ కాల్పులకు ఆదేశించిన రణతుంగను అరెస్టు చేయాలంటూ.. పెట్రోలియం యూనియన్లు సోమవారం సమ్మెకు దిగడంతో పెట్రోల్ బంక్ల వద్ద వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో పోలీసులు రణతుంగను అరెస్ట్ చేశారు. విక్రమ సింఘేను పార్లమెంట్ ద్వారా మాత్రమే తొలగించగలరని స్పష్టం చేశారు.
అటు స్పీకర్ కరు జయసూర్య ప్రధానికి బాసటగా నిలిచారు. ఇప్పటికీ విక్రమ్ సింఘే ప్రధాని అని స్పష్టంచేశారు. పార్లమెంట్ రద్దు నిర్ణయాన్ని అధ్యక్షుడు వెనక్కితీసుకోకుంటే.. దేశంలో రక్తపాతం జరిగే ప్రమాదముందని హెచ్చరించారు. కాగా, ఇప్పటికే దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో విక్రమ్ సింఘేకు మద్దతుగా రోడ్డెక్కారు ప్రజలు.