లోకనాయకుడు, విలక్షణ నటుడుగా పేరు తెచ్చుకున్న కమల్ హాసన్ నటనకు సెలవు ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. డాన్సర్గా.. నటుడిగా.. దర్శకుడిగా.. రచయితగా.. నిర్మాతగా.. దక్షణాది సినిమా ఇండస్ట్రీని ఏలిన కమల్ హాసన్ నటనకు స్వస్తి పలికి పూర్తి స్థాయి పొలిటీషియన్ అవతారం ఎత్తనున్నారు.
ప్రస్తుతం ఇండియన్-2 సినిమా కోసం సన్నద్ధమవుతున్నారు కమల్హాసన్. సమకాలీన రాజకీయాల నేపథ్యంలో దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ నెల 14న చిత్రీకరణ ప్రారంభంకానుంది. ఈ సినిమాపై దృష్టిసారిస్తూనే మరోవైపు రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు కమల్హాసన్.త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘భారతీయుడు 2’ చిత్రమే తన చివరి చిత్రమని ప్రకటించారు.
మంచి సినిమాతో కెరీర్కు ముగింపు పలికితే బాగుంటుందనే ఆలోచనతో కమల్హాసన్ ఉన్నట్లు తెలిసింది .ఇండియన్-2 అయితేనే అందుకు బాగుంటుందని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ సినిమాలో కమల్హాసన్ ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నట్లు తెలిసింది. ఆయనకు జోడీగా కాజల్ అగర్వాల్ నటించబోతున్నది. లైకా సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనున్నది.
2019 ఎన్నికల్లో తమ పార్టీ తరుపున అభ్యర్ధుల్ని పోటీ చేయిస్తున్నామని ఈ ప్రణాళికల్లో భాగంగా సినిమాలకు దూరం అవుతున్నట్టు తెలిపారు. ఇక తన జీవితం పూర్తిగా ప్రజా జీవితానికే అంకితం అన్నారు కమల్.