బీజేపీ ఎమ్మెల్యే పెన్మెత్స విష్ణుకుమార్ రాజు మాటలు వింటూంటే ఆయన బీజేపీకి మంగళం పాడే రోజు దగ్గరలోనే ఉందని తెలుస్తోంది. మొన్న బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ఎవరైనా ముందుకు వస్తారా అంటూ ప్రశ్నించిన విష్ణుకుమార్ రాజు.. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక తాను ఏ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నానో చెబుతానని బాంబు పేల్చారు. అంటే దీనిని బట్టి ఆయన బీజేపీని వీడటం ఖాయమని తెలుస్తోంది. దానికి బలం చేకూర్చేలా ఉన్నాయి అసెంబ్లీలో విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు. 2014లో బీజేపీ, టీడీపీ, వపన్ కళ్యాణ్ కలిసి పని చేయడం వల్లే తాను ఎమ్మెల్యే అయ్యానని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా పవన్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
పదవీకాలం ముగుస్తుంది. ఎన్నికల నోటిఫికేషన్ మరికొన్ని రోజుల్లో వస్తుంది. మరి విష్ణుకుమార్ రాజు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు? నాలుగున్నరేళ్లు చేట్టాపట్టాలు వేసుకొని తిరిగి.. ఆ తర్వాత పోట్లాడుకుంటున్న టీడీపీ పార్టీ నుంచా? లేక ప్రస్తుతం మోదీకి తెర వెనుక అనుకూలంగా వ్యవహరిస్తున్న వైఎస్ఆర్సీపీ నుంచా? లేక సీనియర్ నేతల లేమితో ఇబ్బందులు పడుతూ.. అభ్యర్థులను వెతుక్కుంటున్న జనసేన నుంచా? అనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఇలా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగానే పార్టీకి రాజీనామా చేస్తే వెంటనే ఒప్పేసుకుంటారేమో గానీ.. మరో పార్టీలో చేరాలంటే వారితో ముందుగా చర్చించాలి? టికెట్ ఇచ్చే అవకాశం ఉందో లేదో చూసుకోవాలి? ఇవన్ని చేయాలంటే కాస్త గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి. వారితో మంతనాలు సాగించాలి. ఇటు చూస్తే ఎన్నికలకు మరి కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. అంటే ఓ రకంగా ఆలోచిస్తే విష్ణుకుమార్రాజు ఇపాటికే ఆ పనులన్ని ప్రారంభించి ఉండాలి.
ఇక టీడీపీ, వైఎస్ఆర్సీపీలు ఉన్న అభ్యర్థుల్లో టికెట్లు ఎవరికివ్వాలో అర్థం కాక సతమతమవుతున్నారు. అంటే విష్ణుకుమార్ జనసేన వైపు చూస్తున్నారా? అసెంబ్లీ సాక్షిగా పవన్పై పొగడ్తల వర్షం కురిపించడం వెనుక ఆంతర్యం అదేనా?