అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ మళ్లీ ఫైర్ అయ్యారు. ప్రతి నిత్యం ఏదో సంచలనంతో వార్తల్లోకెక్కుతున్న డొనాల్డ్ ట్రంప్ తాజాగా అమెరికా మీడియాపై మండిపడ్డారు. ఎలక్రానిక్ మీడియా ప్రతినిధులు దారుణంగా ప్రవర్తిస్తున్నారని, ఇక ప్రింట్ మీడియాలో అయితే ప్రతి రోజు అవాస్తవాలను కథనాలుగా ప్రచురిస్తున్నారని అన్నారు.
తనపై ఎన్ని కథనాలు రాసినా తాను మాత్రం మీడియాపై విమర్శలు చేయడం మాననని ట్రంప్ తేల్చి చెప్పారు. న్యూయార్క్ లో డొనాల్డ్ ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ వారిపై విరుచుకుపడ్డారు. ఇక్కడి మీడియా పక్షపాతధోరణితో వ్యవహరిస్తోంది. మీరు ఎంత కవ్వించినా నేను మారను. మీరు రాస్తున్నవన్నీ అసత్యాలే అని ఆయన అన్నారు.
ఐయోవాలో జనవరి నెలలో వృద్ధుల సంక్షేమం కోసం తాను ఒక రాత్రిలో ఆరు మిలియన్ డాలర్లు సేకరించానని ట్రంప్ గతంలో చెప్పుకున్నారు. దీనిపై మీడియాలో విమర్శలు చెలరేగాయి. ఈ విమర్శలపై ట్రంప్ మండిపడుతూ తనను ఎవరు ఎలా విమర్శించినా పట్టించుకోనని అన్నారు.
