తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్ కు అల్లుడైన దగ్గుబాటికి మరో తోడల్లుడు చంద్రబాబు అంటే అస్సలు పడదన్న విషయం మనకు తెలిసిందే. మామ ఎన్టీఆర్ ను మోసం చేసిన బాబుపై ఆయనపై దుమ్మెత్తిపోస్తుంటారు.
తాజాగా దగ్గుబాటి వైఎస్ఆర్సీపీలో చేరేందుకు సిద్ధం కావడంతో టీడీపీ… ఆయన అనుకూల మీడియా రగిలిపోతోంది. తాజాగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ తన కొత్తపలుకు ఎడిటోరియల్ లో దగ్గుబాటి గురించి హాట్ కామెంట్స్ చేశారు. ‘చంద్రబాబు అధికారం పార్టీపై కమాండ్ ను చూసి దగ్గుబాటి అసూయతో రగిలిపోతున్నాడు’ అంటూ రాధాకృష్ణ రాసుకొచ్చారు. ఈ విషయం ఆ నోటా.. ఈ నోటా తెలిసిందో.. లేక ఆయనే ప్రత్యక్షంగా చదివారో తెలియదు కానీ.. ఆయన తీవ్రంగా స్పందించారు.
ఏబీఎన్ రాధాకృష్ణ ఎందుకు రగిలిపోతున్నారో అర్థం కావడంలేదని.. బహుశా తాను వైఎస్ఆర్సీపీలో చేరడాన్ని ఆయన జీర్ణించుకోవడం లేదు కాబోలు అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇక అక్కడితో ఆగలేదు… రాధాకృష్ణ ఏపీ ప్రాజెక్టుల్లో కమీషన్లు పొందుతున్నాడు.. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాబోతోంది. ఇదే జరిగితే ఆయన డబ్బును.. కమీషన్ ను పొందలేడు కదా అని కామెంట్ చేశారు. అందుకే చంద్రబాబు గెలుపుకు తాను తెర వెనుక.. తెర ముందు చేయాల్సిందంతా చేస్తున్నారన్నారు. రాధాకృష్ణ, చంద్రబాబులను చూస్తుంటే జాలి వేస్తోందని దగ్గుబాటి ఎద్దేవా చేశారు.
ఇక చంద్రబాబుపై కూడా నిప్పులు చెరిగారు. తన తోడల్లుడు ఒక ప్రత్యేక రకమైన మనిషన్నారు. ఉదయం ఓ మాట చెప్పి.. సాయంత్రం దానికి విరుద్దమైన వ్యాఖ్యలు ఆయనకే చెల్లిందన్నారు. చంద్రబాబును చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. ఇక ఆయన నిర్వహించే సుధీర్ఘ సమీక్ష సమావేశాలను అధికారులు బోరింగ్ గా ఫీలవుతున్నారు. ఇప్పటికే స్పీకర్ పోస్టును బాబు నామమాత్రంగా చేశారు. స్పీకర్ సొంతంగా నిర్ణయం తీసుకొని టీడీపీలో నిలబడగలరా?’ అంటూ దగ్గుబాటి… చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.
‘ప్రకృతిలో నాలుగు వింతలున్నాయని.. ఐదో వింత చంద్రబాబు. ఇప్పుడు భవిష్యత్తులో కూడా ఆయనే వింత. పోలవరాన్ని టీడీపీ జేబులు నింపుకోవడానికే కడుతున్నారు. మైనింగ్ తో టీడీపీ నేతలు కోట్లకు పడగలెత్తారు. అమరావతిలో అభివృద్ధి పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. ’అంటూ బాబు పాలనను దగ్గుబాటి కడిగిపారేశారు.