లార్డ్స్ మైదానంలో ఇవాళ ఇంగ్లండ్, న్యూజిలాండ్ల మధ్య జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ 2019 ఫైనల్ లో ఇంగ్లండ్నె అదృష్టం వరించింది. దీంతో విశ్వవిజేతగా అవతరించింది ఇంగ్లండ్. మ్యాచ్లో విచిత్రం ఏంటంటే మ్యాచ్ టైగా ముగియడంతో సూపర్ ఓవర్ నిర్వహించారు. అయితే ఆశ్చర్యంగా సూపర్ ఓవర్ కూడా టై అయింది. ఈ క్రమంలో మ్యాచ్లో ఇంగ్లండ్ సాధించిన బౌండరీలు ఎక్కువగా ఉండడంతో ఐసీసీ నియమావళి ప్రకారం ఆ జట్టునే విజేతగా ప్రకటించారు. ఇంతకు ముందు వరకు 3 వరల్డ్ కప్లలో ఇంగ్లండ్ ఫైనల్స్కు చేరుకున్నా కనీసం ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవలేదు. అయితే ఇవాళ్టి విజయంతో ఇంగ్లండ్కు ఆ ఒక్క లోటు తీరిపోయింది.
మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. అర్ధ సెంచరీ సాధించిన ఓపెనర్ హెన్రీ నికోల్స్ (77 బంతుల్లో 55; 4 ఫోర్లు) టాప్ స్కోరర్. వికెట్ కీపర్ టామ్ లాథమ్ (56 బంతుల్లో 47; 2 ఫోర్లు, సిక్స్) రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, లియామ్ ప్లంకెట్లు చెరో 3 వికెట్లు తీయగా, జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్లు చెరొక వికెట్ తీశారు.
241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 241 పరుగులు చేసి ఆలౌట్ అయి న్యూజిలాండ్ స్కోరును సమం చేసింది. ఇంగ్లండ్ బ్యాట్స్మెన్లలో బెన్ స్టోక్స్ (98 బంతుల్లో 84 పరుగులు, 5 ఫోర్లు, 2 సిక్సర్లు), జాస్ బట్లర్ (60 బంతుల్లో 59 పరుగులు, 6 ఫోర్లు)లు రాణించారు. కివీస్ బౌలర్లలో లాకీ ఫెర్గుసన్, జేమ్స్ నీషమ్లకు చెరో 3 వికెట్లు దక్కగా, మ్యాట్ హెన్రీ, కొలిన్ డి గ్రాండ్హోమ్లకు చెరొక వికెట్ దక్కింది.
న్యూజిలాండ్, ఇంగ్లండ్ల మధ్య వరల్డ్ కప్ 2019 ఫైనల్ మ్యాచ్ టైగా ముగియడంతో అంపైర్లు సూపర్ ఓవర్ నిర్వహించారు. ఈ క్రమంలో రూల్స్ ప్రకారం ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ సూపర్ ఓవర్లో 6 బంతులకు 15 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ స్టోక్స్, బట్లర్లు బ్యాటింగ్ చేశారు. న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ వేశాడు. అనంతరం 16 పరుగుల విజయలక్ష్యంతో సూపర్ ఓవర్ ఆడిన న్యూజిలాండ్ 6 బంతుల్లో 15 పరుగులు చేసింది. మరో సారికూడా టైకావడంతో ఎక్కువ పోర్లు కొట్టిన ఇంగ్లండ్ జట్టును విజేతగా ప్రకటించారు.