ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు జగన్ ప్రభుత్వం తాజాగా గుడ్ న్యూస్ అందించింది. ఇప్పటికే సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలకు పెంచుతూ ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులను జారీ చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికుల పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచాలంటూ… ఆర్టీసీ విలీన అధ్యయన కమిటీ చేసిన సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో నేడు పదవీ విరమణ చేయాల్సిన ఉద్యోగులు, కార్మికులు తమ సర్వీసుల్లో మరో రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. పదవీ విరమణ పొడిగింపుపై కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఆర్టీసీలోని 52 వేల కుటుంబాలు ప్రయోజనం పొందనున్నాయి.