అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన వేళ దేశంలో ఎన్నికల వేడి రాజుకుంది. తాజాగా దేశంలో ఖాళీ కాబోతున్న రాజ్యసభ ఎంపీ సీట్లకు ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది.
ఈ షెడ్యూల్ లో మొత్తం 55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ను మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం లాంఛనంగా విడుదల చేసింది. ఈ మేరకు మార్చిలోనే రాజ్యసభ ఎన్నికలు నిర్వహించడానికి రంగం సిద్ధం చేసింది.
మొత్తం 17 రాష్ట్రాల నుంచి 55 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ లో 4, తెలంగాణలో 2 రాజ్యసభ స్థానాలున్నాయి.
మార్చి 6వ తేదీన రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. మార్చి 13న నామినేషన్ల స్వీకరణ తుదిగడువుగా ప్రకటించారు. మార్చి 16న రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్లను పరిశీలించనున్నారు. మార్చి 18న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు.
మార్చి 26న రాజ్యసభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఉదయం 9 గంటలకు మొదలై సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగియనుంది.
తెలంగాణ రాజ్యసభ రేసులో మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కేకే రేసులో ఉన్నారు.