తమిళ్ కోలీవుడ్లో హీరోయిన్ త్రిషపై ఓ సినిమా నిర్మాత మండిపడుతున్నాడు. తమ సినిమాను ఒప్పుకొని షూటింగ్లో పాల్గొని తర్వాత వద్దనుకున్న త్రిషపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు. త్రిషపై సామి-2 సినిమా నిర్మాత శిబు థమీన్స్ చెన్నైలోని నడిఘర్ సంఘంలో ఫిర్యాదు చేశాడు. చియాన్ విక్రమ్ 2003లో సామి అనే సినిమాను చేశాడు. ఇప్పుడు దానికి సీక్వెల్గా సామి-2 సినిమా చేస్తున్నారు. హరి దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా త్రిషను హీరోయిన్గా ఎంపిక చేశారు. అయితే కొద్దిరోజులు షూటింగ్లో పాల్గొన్న త్రిష్ట కొన్ని కారణాలతో ఈ సినిమా చేయలేనని చెప్పేసింది.
ఆమె హ్యాండివ్వడంతో హీరోయిన్ కీర్తి సురేశ్ను సినిమాకు ఎంపిక చేసుకున్నారు. సినిమా నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న త్రిష వలన తమకు తీవ్ర నష్టం ఏర్పడిందని, ఆమెపై చర్యలు తీసుకోవాలని నడిఘర్ సంఘంలో నిర్మాత శిబు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుపై నడిఘర్ సంఘం ఏం చర్యలు తీసుకుంటుందో ఎదురుచూడాలి. ఈ విషయంపై త్రిష ఇప్పటివరకు స్పందించలేదు.