హీరో కమల్ హాసన్ హోం క్వారంటైన్ లో ఉన్నారనే వార్త రావడంతో ఆయన ఫ్యాన్స్ శనివారం ఉదయం తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. అయితే అలాంటిదేమి లేదని తెలియడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. చెన్నైలోని ఆల్వార్పేట్లో ఉన్న కమల్ ఇంటికి చెన్నై కార్పోరేషన్ ‘హోం క్వారంటైన్’ స్టిక్కర్ను అతికించింది. కొంతసేపటికి ఆ స్టిక్కర్ను తొలిగించారు.
ఈలోపలే ఆ సమాచారం అభిమానుల దగ్గర్కి వెళ్లిపోయింది. దాంతో తమ హీరోకి ఏమైందన్న భయం అందరిలో మొదలైంది. విషయం కమల్ దగ్గరకు వెళ్లడంతో ఆయన స్పందించారు. అభిమానులనుద్దేశించి ఒక ప్రకటనను విడుదల చేశారు. ‘‘నా ఇంటి బయట గోడకు నోటీస్ అంటించడం వల్ల నేను క్వారంటైన్లో ఉన్నానని ఒక వార్త వ్యాపించింది. కానీ, నేను కొన్నేళ్లుగా ఆ ఇంట్లో ఉండటం లేదని మీలో చాలా మందికి తెలుసు.
ప్రస్తుతం ఆ ఇంటిని మక్కల్ నీది మయ్యం పార్టీ ఆఫీసుగా వినియోగిస్తున్నాం. కాబట్టి, నేను క్వారంటైన్లో ఉన్నాను అని వచ్చిన వార్తలు అవాస్తవం’’ అని తన ప్రకటనలో కమల్ హాసన్ స్పష్టం చేశారు. కరోనా వైరస్ నుంచి రక్షణ పొందడంలో భాగాంగా తాను సామాజిక దూరాన్ని పాటిస్తున్నానని కమల్ పేర్కొన్నారు. ప్రజలు కూడా సామాజిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు.