అమరావతిని రాజధానిగా చేసుకుని పరిపాలించిన గౌతమిపుత్ర శాతకర్ణి గురించి దేశంలో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని నందమూరి అందగాడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో డిక్టేటర్ శతదినోత్సవ వేడుకల్లో బాలకృష్ణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాతకర్ణి తన పాలనలో ప్రజలకు ఎంతో మేలు చేశారని, తల్లి పేరు పెట్టుకున్న ఏకైక చక్రవర్తి శాతకర్ణేనని ఆయన అన్నారు. తన నటన కాని, జీవితం కాని తండ్రి ఎన్. టి.రామారావు స్ఫూర్తి నుంచి తీసుకున్నవేనని, ఆయనలాగే తాను కూడా సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాల్లో నటిస్తున్నానని అన్నారు.
తనకు ఎంతో మంది అభిమానులున్నారని, వారి అభిమానానికి వెలకట్టలేనని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి మృణాళినితో పాటు ఉత్తరాంధ్రకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాల నుంచి బాలకృష్ణ అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.