తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు. తెలుగు జాతి ఉన్నంత కాలం ఆయన పేరు నిలిచిపోతుందని అనడంతో ఎటువంటి సందేహం లేదు. అలాంటి వ్యక్తి జీవితాన్ని సినిమాగా తెరకెక్కిస్తున్నారంటే ,ఈ సినిమాపై భారీ అంచనాలతో పాటు, సినిమా ఎలా ఉంటుందో అని ఆతృతగా కూడా అందరిలోను నెలకొంది. ఎన్టీఆర్ రోల్లో ఆయన కొడుకు బాలకృష్ణ నటించారు. రెండు పార్ట్లుగా తెరకెక్కింది ఈ బయోపిక్. ఇందులో మొదటి పార్ట్ కథానాయకుడు ఈ రోజే(బుధవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాలయ్యకు హిట్ ఇచ్చిందా? , ఎన్టీఆర్ రోల్లో బాలయ్య మెప్పించాడా..? అనేది రివ్యూ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
కథ:
ఎన్టీఆర్ చిన్నప్పటి సీన్తో సినిమా మొదలవుతోంది. 5 నిమిషాలలో ఎన్టీఆర్ చిన్నప్పటి రోల్ గురించి వివరించాడు దర్శకుడు. తరువాత ఎన్టీఆర్ చదువుకునే రోజుల దగ్గర నుంచి సినిమా ప్రారంభం అవుతోంది. చదువుకుంటునే ప్రభుత్వ రిజాస్టార్ ఆఫీస్లో పని చేస్తుంటాడు. అక్కడ జరుగుతున్న అన్యాయాలు చూడలేక ఉద్యోగం మానేస్తాడు ఎన్టీఆర్. ఆ సమయంలోనే ఎన్టీఆర్కు సినిమాలలో నటించాలనే కోరిక మొదలవుతోంది. వెంటనే మద్రాస్ బయలుదేరి వెళ్తాడు.ఎల్వి ప్రసాద్ సినిమాలో ఎన్టీఆర్కు నటించే అవకాశం దక్కుతుంది.అక్కడ నుంచి ఎన్టీఆర్ సినీ ప్రస్థానం మొదలవుతోంది. ఒక సినిమా తరువాత మరోక్కటి చేస్తు అంచెలంచెలుగా ఎదుగుతు స్టార్ హీరోగా ఎలా ఎదిగాడు?
తెలుగు ప్రజల ఆరాధ్య దైవంగా ఎలా మారాడనేది సినిమాలో చూపించారు. ఎన్టీఆర్ సినిమాలలో ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి మొదలైన ఈ సినిమా , ఆయన తెలుగుదేశం పార్టీ ప్రకటనతో ముగుస్తుంది.
విశ్లేషణ:
ఎన్టీఆర్ చరిత్రను సినిమా తీయాలన్నది ఒక గొప్ప ఆలోచన. దానికి తగిన నటీనటులు సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు దొరికారు. ఎన్టీఆర్ జీవితంలో ఏం చూడాలనుకుంటున్నారో.. ఏం తెలుసుకోవాలనుకుంటారో.. వాటిని తెరపై చూపించాడు దర్శకుడు. ఎన్టీఆర్ సినిమా రంగ ప్రవేశం చేసిన తర్వాత ఆయన పోషించిన పాత్రలన్నీ ప్రతి ఐదు నిమిషాలకోసారి మనకు దర్శనమిస్తాయి. సినిమాలో బాలకృష్ణ నటించాడు అనడం కంటే జీవించాడు అని చెప్పాలి.నిమ్మకూరులో ఆయన జన్మించిన క్షణం నుంచి బి.ఏ పూర్తి చేయడం.. ఉద్యోగం చేయడం.. ఆ తర్వాత అది వదిలేసి మద్రాసు వచ్చి సినిమాల్లో ప్రయత్నించడం.. మనదేశం సినిమాలో తొలి వేషం వేయడం.. అక్కడినుంచి మెల్లమెల్లగా ఒక్కో సినిమా చేసుకుంటూ స్టార్గా ఎదగడం.. సూపర్ స్టార్గా మారడం.. ఇలా ఒక్కటేమిటి ప్రతి ఒక్కటి పూసగుచ్చినట్లు చూపించాడు క్రిష్.
నటీ,నటుల ఫర్మామెన్స్:
నందమూరి తారకరామారావు పాత్రలో నటించి మెప్పించాలంటే ఎంతో గుండె ధైర్యం కావాలి.. అది కేవలం ఆయన వారసులకు మాత్రమే ఉంటుందని బాలకృష్ణ నిరూపించాడు.రూపంలో ఎన్టీఆర్ను మరిపించలేకపోయినా కూడా ఆహార్యంలో మాత్రం అన్నగారిని బాగానే అనుకరించాడు బాలయ్య. బసవతారకం పాత్రలో విద్యాబాలన్ జీవించింది. అక్కినేని నాగేశ్వర రావు పాత్రలో సుమంత్ ఒదిగిపోయాడు. హరికృష్ణగా కల్యాణ్ రామ్.. శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్ ఇలా ఎవరికి వారు అద్భుతంగా నటించారు. ఎన్టీఆర్-ఏయన్నార్ల అనుబంధాన్ని కూడా తెరపై అందంగా ఆవిష్కరించారు. చంద్రబాబుగా రానా పాత్ర చివరిలో తళుక్కున మెరుస్తుంది.
సాంకేతిక పరిజ్ఞానం:
దర్శకుడిగా క్రిష్ గురించి కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేదు.. ఇంత భారీ సినిమాను కేవలం ఆరు నెలల్లోనే తీసి విడుదల చేయడం అంటే చిన్న విషయం కాదు.. అందులోనూ ఆంధ్రులు దైవంగా భావించే అన్నగారి బయోపిక్ తీయడం మాటలు కాదు.. తన దగ్గర ఉన్న కథను ఎమోషనల్గా అద్భుతంగా తెరకెక్కించాడు క్రిష్. కథానాయకుడు విషయంలో పెద్దగా వివాదాలు లేకపోవడం కలిసివచ్చే విషయం. మహానాయకుడు ఎలా డీల్ చేస్తాడు అనే దానిని బట్టి ఎంత వరకు సక్సెస్ అయ్యాడు అని చెప్పొచ్చు.ఎం.ఎం.కీరవాణి సంగీతం కథానాయకుడు చిత్రానికి ప్రాణం. ముఖ్యంగా కథానాయక పాట అద్భుతంగా ఉంది.. విజువల్ పరంగా కూడా అభిమానులకు కన్నుల పండుగ ఈ పాట. సినిమాటోగ్రఫీ బాగుంది.. మేకప్ నిపుణులను ఈ సినిమాలో ప్రత్యేకంగా అభినందించాలి. వాళ్లు చాలా కష్టపడ్డారు సినిమా కోసం. ఎడిటింగ్ బాగుంది.
బోటమ్ లైన్:
ఎన్టీఆర్ మైమరిపించలేకపోయిన బాలయ్య