ఈ సంవత్సరం సంక్రాంతి సీజన్, ఆ తర్వాత కూడా ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే స్థాయి సినిమా ఒక్కటి కూడా పడలేదు. నీది నాదీ ఒకే కథ లాంటి మంచి సినిమాలు వచ్చినప్పటికీ మార్కెట్ని షేక్ చేసే స్థాయి సినిమా అయితే ఇప్పటి వరకూ పడలేదు. ఆ సినిమా రంగస్థలమే అని ట్రేడ్ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. తాజాగా ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ అయింది. యూ బై ఎ సర్టిఫికెట్ వచ్చింది. సినిమా రన్ టైం 2 గంటల 59 నిమిషాలు. ఇప్పుడు ఈ విషయమే ఇండస్ట్రీ వర్గాలను, మెగా ఫ్యాన్స్ని కూడా ఆశ్ఛర్యపరుస్తోంది. మామూలుగా అయితే వీలైనంత సేఫ్గా, మార్కెట్ లెక్కలు చూసుకుని ముందుకు వెళదాం అనేది మెగాస్టార్ సిద్ధాంతం. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం మెగాస్టార్ చేత అలాంటి రూల్స్ అన్నీ పక్కన పెట్టించాడు సుకుమార్. మెగా కాంపౌండ్ కూడా పూర్తిగా సుకుమార్కే ఛాయిస్ ఇచ్చేసింది. ప్రేక్షకులు అర్జున్ రెడ్డికి కనెక్ట్ అయినట్టుగా చిట్టిబాబుకు కూడా కనెక్ట్ అయితే మాత్రం రన్ టైం అనేది అస్సలు విషయమే అవ్వదన్నది క్రిటిక్స్ మాట.
ఇక రంగస్థలం బిజినెస్ కూడా రామ్ చరణ్ కెరీర్లోనే హైయెస్ట్గా నిలిచింది. వరల్డ్ వైడ్గా ఈ సినిమా 79. 10 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. ఖర్చులు కూడా కలుపుకుంటే మొత్తం 83 కోట్లకు లెక్కతేలింది. రామ్ చరణ్ కెరీర్లో ఇదే హైయెస్ట్ ప్రి రిలీజ్ బిజినెస్. ఓవర్సీస్ 9 కోట్లు, నైజాం 18కోట్లు, సీడెడ్ 12…..ఇలా అన్ని ఏరియాల్లోనూ ఇప్పటి వరకూ రామ్ చరణ్ సినిమాలు సాధించిన కలెక్షన్స్ కంటే కూడా ఎక్కువ రేంజ్లో అమ్ముడుపోయింది రంగస్థలం. సుకుమార్ పై ఉన్న నమ్మకంతో పాటు ఇప్పటికే బయటికి వచ్చిన అవుట్ పుట్ అంతా కూడా సినిమా లవర్స్ని విశేషంగా ఆకట్టుకుంది. సాంగ్స్ అయితే ఛార్ట్ బస్టర్స్గా నిలిచాయి. రిలీజ్కి ముందే టాప్లో ట్రెండ్ అవుతోంది రంగస్థలం. అందుకే ట్రేడ్ వర్గాలు కూడా రంగస్థలంపై విపరీతమైన ఆసక్తి చూపించాయి. ప్రేక్షకులను మెప్పించడంలో కూడా సుకుమార్ సక్సెస్ అయ్యాడంటే మాత్రం రామ్ చరణ్ కెరీర్లోనే ఈ సినిమా ప్రత్యేకంగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్రలో ఒన్ ఆఫ్ ది క్లాసిక్ హిట్స్గా నిలిచిపోతుందని కూడా మెగాభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.