భార్య మరణం గురించి వివరించిన బోని కపూర్
సినీ పరిశ్రమ అతిలోకసుందరి శ్రీదేవి మృతి చెందడం అందరినీ విచారంలో ముంచేసింది. అయితే ఆమె మరణంలో పలు అనుమానాలు ఉన్నాయని హైప్ కోసమో.. తమ వ్యూస్ పెంచుకోవడానికి పుకార్లు పలు మీడియా సంస్థలు సృష్టిస్తున్నాయి. ఆమె మరణం మిస్టరీ అని రాద్ధాంతం చేస్తున్నారు. ఏం జరిగింది.. ఎలా జరిగింది అనేదానిపై పలు రకాల కథనాలు, వార్తలు ప్రచారంలో ఉన్నాయి. వీటిన్నిటిని కొట్టి పారేస్తూ శ్రీదేవి భర్త బోని కపూర్ సమాధానం ఇచ్చారు. అసలు ఆ రోజు ఏం జరిగిందో వెల్లడించారు.
శ్రీదేవి మేనల్లుడి పెళ్లి కోసం దుబాయ్కు బోనికపూర్తో పాటు శ్రీదేవి, చిన్న కూతురు ఖుషీ వెళ్లారు. పెళ్లయిన వెంటనే భర్త బోనీకపూర్ కూతురిని తీసుకుని ముంబై వచ్చేశారు. ఈ విషయం శ్రీదేవికి కూడా తెలుసు. దుబాయ్లో శ్రీదేవితోపాటు చెల్లి శ్రీలత ఉన్నారు. అయితే శ్రీదేవిని సర్ప్రైజ్ చేద్దామని బోనీకపూర్ శనివారం సాయంత్రం మళ్లీ దుబాయ్ వెళ్లారు. శ్రీదేవి బస చేసిన జువైరా ఎమిరేట్స్ టవర్స్ హోటల్ చేరుకున్నారు. అలా వెళ్లిన భర్త వెంటనే మళ్లీ తిరిగి రావడంతో శ్రీదేవి నిజంగా సర్ప్రైజ్ అయ్యింది. ఇద్దరూ కొద్దిసేపు మాట్లాడుకున్న అనంతరం సాయంత్రం 5.30 గంటలకు శ్రీదేవి నిద్రపోయింది.
రాత్రి 8.30 గంటల సమయంలో (దుబాయ్ టైమింగ్స్) భార్య శ్రీదేవిని బోనికపూర్ నిద్రలేపాడు. భోజనం చేద్దామని చెప్పడంతో రెడీ అయ్యి వస్తానంటూ బాత్ రూంకి వెళ్లింది. 15 నిమిషాలు అయినా బాత్రూమ్ నుంచి బయటకు రాలేదు. పిలిచినా పలకలేదు. తలుపుకొట్టినా చడి చప్పుడు లేకపోవడంతో తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూశాడు. నిండా నీళ్లున్న బాత్ టబ్లో అచేతనంగా శ్రీదేవి పడి ఉంది. ఆశ్చర్యానికి గురయ్యాడు. వెంటనే బోని దుబాయ్లోని తన స్నేహితుడికి ఫోన్ చేశాడు. హోటల్ సిబ్బందికి సమాచారం ఇచ్చి శ్రీదేవిని వెంటనే రషీద్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ పాటికే అందానికి చిరునామాగా ఉన్న శ్రీదేవీ ఇక లేదని వైద్యులు ధృవీకరించారు. ఇది వాస్తవంగా జరిగింది.. ఆమె మరణంపై ఎలాంటి పుకార్లు నమ్మొద్దు అని సూచిస్తున్నారు. శ్రీదేవి మరణంపై పుకార్లు వస్తే తాము ఇంకా బాధపడుతామని ఆవేదనతో చెప్పారు.