చంద్రబాబుపై దర్శక, నిర్మాత తమ్మారెడ్డి ఫైర్
ప్రత్యేక హోదా పోరాటం విషయంలో టాలీవుడ్పై తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు విమర్శలు కొనసాగిస్తున్నారు. తమ అవార్డులు తీసుకొని ఇప్పుడు ఏపీ కోసం పోరాడరా? అని నిలదీస్తున్నారు. దీంతో ఈ విషయమై దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఫైరయ్యారు. ఏపీ పాలనపై, చంద్రబాబు పనితీరుపై మండిపడ్డారు.
నంది అవార్డులు తీసుకోలేదు.. పంచుకున్నారని భరద్వాజ ఆరోపించారు. నంది అవార్డులు తీసుకున్నపుడు గొడవ చేశామన్నారు కదా.. ఆ నంది అవార్డు కమిటీలు వేసింది కూడా మీరే (చంద్రబాబు నాయుడు) కదా అని పేర్కొన్నారు. తమరు పంచిన నంది అవార్డులు తీసుకున్న వారు ఈ విషయంపై ఎందుకు స్పందించరు అని నిలదీశారు. ఆడవాళ్ల అందాలతో సినిమా తీసేవాళ్లు తమరి పక్కనే ఉన్నారు కదా! వారెందుకు హోదా కోసం పోరాడరు అని ప్రశ్నించారు. ముందు మీ బావమరిది బాలకృష్ణతో రాజీనామా చేయించు.. తాము ఏసీల్లో కులుకుతున్నామా..? మీరే (టీడీపీ నాయకులను ఉద్దేశించి) లంచాలు తిని ఏసీల్లో కులుకుతున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
రాత్రి, పగలు కష్టపడితే పది మందికి అన్నం దొరుకుతుందని గుర్తుచేశారు. ప్రత్యేక హోదా విషయం కంటే జగన్, మోదీ, పవన్ ఎక్కడ కలుస్తారనే విషయం చంద్రబాబుకు భయంగా ఉందని ఏకంగా రాజకీయ విమర్శలు చేశారు. అందుకే సినిమా వాళ్ల మీద నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా సాధ్యం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎప్పుడో చెప్పారు కానీ అప్పటి నుంచీ మౌనంగా ఉన్న చంద్రబాబు నాయుడికి ఇప్పుడెందుకు గుర్తుకొచ్చిందని ప్రశ్నించారు.సినిమా వాళ్ల భార్యల గురించి అసభ్యంగా మాట్లాడినప్పుడు మాట్లాడని వారు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని నిలదీశారు. ఈ విధంగా తమ్మారెడ్డి భరద్వాజ ఏపీ ప్రభుత్వంపై, చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు.