ఈ నడి మధ్య చిన్న సినిమాలు బీభత్సంగా విడుదలయ్యాయి. కేవలం ఈ నెలలోనే దాదాపు 20 నుంచి 30 మధ్య సినిమాలు విడుదల అయ్యి ఉంటాయి. ఈ శుక్రవారం విడుదలైన ఏడు సినిమాల్లో ముఖ్యంగా మూడు సినిమాలపై ఆసక్తి కలిగించాయి. శ్రీవిష్ణు నటించిన మెంటల్ మదిలో, నారా రోహిత్ సినిమా బాలకృష్ణుడు, ఇక నెపోలియన్ అని ప్రతినిధి దర్శకుడు స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించాడు. ఈ సినిమాలను ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మెంటల్ మదిలో..
క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ ప్రేక్షకులను శ్రీవిష్ణు మెప్పిస్తున్నాడు. అతడు కథనాయకుడిగా పెళ్లిచూపులు నిర్మాత రాజ్ కందుకూరి ఆధ్వర్యంలో మెంటల్ మదిలో సినిమా విడుదలైంది. ఈ సినిమా మంచి టాక్ వినిపిస్తోంది. ఈ కథ చూస్తే.. అరవింద్ కృష్ణ (శ్రీ విష్ణు) సాఫ్ట్వేర్ ఉద్యోగి. చిన్నప్పటి నుంచి రకరకాల మానసిక ఇబ్బందులు ఉంటాయి. కన్ఫ్యూజన్ కూడా ఒకటి. రెండోది అమ్మాయిలను చూసి భయపడటం. ఒకసారి పెళ్లి చూపుల్లో స్వేచ్ఛ (నివేదా పెతురాజ్) ఇష్టపడుతుంది. ఆ అమ్మాయితో మాట్లాడి నిశ్చితార్థం దాక వచ్చి ఆగిపోతోంది. అయినా ఒకరినొకరు ఇష్టపడుతూనే ఉంటారు. అలాంటి సమయంలో అరవింద్కి ముంబైలో పనిచేస్తుండగా అతడికి రేణు (అమృత) పరిచయమవుతుంది. తాను కలలు గన్న అమ్మాయిగా తను కనిపించడంతో ఇష్టపడతాడు. తర్వాత రేణుకి అరవింద్ మధ్య సంబంధం ఏంది? ఇంతకీ అరవింద్ కృష్ణ ఎవరిని చేసుకున్నాడు? తనను మార్చిన స్వేచ్ఛనా? లేకుంటే తను ఇష్టపడ్డ రేణునా? అనేది కీలకం. శ్రీవిష్ణు అద్భుతంగా నటించాడు. హీరోయిన్ నటన సినిమాకు ప్లస్. ఈ సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా ప్రేక్షకులను అలరిస్తోంది. రాజ్ కందుకూరి ఈ సినిమా నిర్మించాడంటే ఓ అర్థం ఉంది. ఆయన అభిరుచిగా తగ్గట్టు సినిమా ఉంది.
బాలకృష్ణుడు
వరుస సినిమాలు చేస్తున్నా ఒక్క సినిమా కమర్షియల్గా హిట్ కాలేదు. మంచి పేరు తీసుకురాలేదు. అయినా సినిమాలు చేస్తూ నారా రోహిత్ వస్తున్నాడు. ఈసారి బాలకృష్ణుడుగా తెరమీదకు వచ్చాడు. రాయలసీమ నేపథ్యంలో సినిమా ఉంటది. భానుమతిదేవి (రమ్యకృష్ణ), ప్రతాప్రెడ్డి (అజయ్) మధ్య వివాదం నడుస్తుంటుంది. భానుమతిదేవి మేనకోడలు ఆద్య (రెజీనా)ని చంపి కక్ష తీర్చుకోవాలనుకుంటాడు ప్రతాప్రెడ్డి. ఇతడి నుంచి రక్షణగా ఆద్యకు తెలియకుండానే బాలు (నారా రోహిత్)ను బాడీగార్డ్గా నియమిస్తుంది. ప్రతాప్ జైలు నుంచి తప్పించుకుని ఆద్యను చంపాలనుకుంటాడు. అతడి నుంచి ఆద్యను బాలు రక్షించాడా? లేదా? వారిద్దరి మధ్య ప్రేమ చిగురించాక ఏం జరిగింది? అన్నదే ‘బాలకృష్ణుడు’ కథ. రమ్యకృష్ణ నటన సినిమాకు ప్లస్. రెజీనా, రోహిత్ జోడీ బాగుంది. సినిమా ఒక్కడక్కడ స్లో అయినా ఆసక్తికరంగా ఉంటుంది. రోహిత్ కొంచెం పర్సనాలిటీ తగ్గి ఉంటే సినిమాకు కలిసొచ్చేది. పృథ్వీ కామెడీ నవ్వులు పూయించింది. అయితే ఈ సినిమా సోసో మిగిలే అవకాశం ఉంది. కొత్త దర్శకుడు అయినా పవన్ మల్లెల సినిమాను బాగానే తీశాడు. మణిశర్మ సంగీతం ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్. ఒక్కసారి థియేటర్కు వెళ్లొచ్చు.
నెపోలియన్
నా నీడ పోయింది సార్ అనే పోస్టర్తో ప్రేక్షకులను ఆలోచింపజేసిన సినిమా నెపోలియన్. ప్రతినిధి సినిమా దర్శకుడు, తాను దర్శకత్వం వహించి నెపోలియన్లో హీరోగా నటించాడు. విభిన్న కథాంశంతో ముందుకు వచ్చాడు. అశోక్కుమార్ (ఆనంద్ రవి), స్రవంతి (కోమలి) అనాథలు. ఇద్దరూ పెళ్లి చేసుకొని జీవితాన్ని మొదలుపెడతారు. పిల్లలు లేకపోవడంతో అనాథాశ్రమానికి వెళ్లి ఓ పాపని చూసి పెంచుకోవాలని నిర్ణయించుకొంటారు. అక్కడ ఒక విషయంలో ఇద్దరి మధ్య మనస్పర్థలొస్తాయి. ఆ తర్వాత నుంచి అశోక్లో మార్పొస్తుంది. ఇంటి నుంచి బయటికి వెళ్లి నా నీడ పోయిందంటూ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేస్తాడు. స్రవంతి అసలు తన భార్యే కాదంటాడు. తన పేరు కూడా అశోక్ కాదని, నెపోలియన్ అనీ చెబుతాడు. అశోక్లో అంతగా మార్పు రావడానికి కారణమేమిటి? అసలు అనాథాశ్రమంలో ఏం జరిగింది? నిజంగా అతని నీడ పోయిందా? ఒకవేళ పోతే ఎలా పోయింది? అశోక్కీ, నెపోలియన్కీ మధ్య సంబంధం ఏమిటన్నది ఈ సినిమా. ఓ హత్య చుట్టూ కొనసాగే కథ ఇది. దర్శకుడిగా మంచిగా తీసినా నటనలో మెరుగుపడలే. అశోక్, స్రవంతి, సర్కిల్ ఇన్స్పెక్టర్ చుట్టూ సినిమా తిరుగుతుంది. సినిమా మంచిగా తీశారు. సస్పెన్స్ ఇష్టపడే ప్రేక్షకులు ఈ సినిమాను చూడొచ్చు. దర్శకుడి ప్రయత్నాన్ని అభినందించొచ్చు.
దేవీశ్రీప్రసాద్
ఇక దేవీ, శ్రీ, ప్రసాద్గా ఓ హర్రర్ కథ నేపథ్యంలో కూడా ఓ సినిమా వచ్చింది. ఓ నటి ప్రమాదంలో మృతి చెందగా ఆమె అభిమానులు ముగ్గురు చనిపోయిన తర్వాత ఏం చేశారు. ఆమె ఎలా చనిపోయింది? ఆమె మృతదేహాంతో ఆ అభిమానులు ఏం చేశారు? అనే కథాంశంతో ఈ సినిమా సాగుతుంది. కొంత భయపెట్టిస్తుంది. కమెడియన్ ధన్రాజ్, భూపాల్, మనోజ్నందంలు నటన పరవాలేదనిపిస్తుంది. దర్శకుడు శ్రీ కిషోర్ స్త్రీలకు రక్షణ లేకుండా పోతుందనే పాయింట్తో ఓ కొరియన్ సినిమా ఆధారంగా ఈ సినిమాను తీశాడు. ఈ సినిమా కూడా బోర్ కొట్టకుండా పిచ్చి లాజిక్లు లేకుండా సాగుతుంది.
ఇక ఈ సినిమాతో పాటు మళయాలం సినిమాకు డబ్బింగ్గా హేయ్ పిల్లగాడ సినిమా వచ్చింది. దుల్కర్, ఫిదా ఫేమ్ సాయిపల్లవి నటించిన ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. వీటితో ఇంకా రెండు, మూడు సినిమాలు వచ్చాయి. అవి పరవాలేదనిపించాయి.