ర్యాగింగ్ భూతానికి మరో నిండుప్రాణం బలైంది. సీనియర్ల వేధింపులు తట్టుకోలేక అనంతపురం జిల్లాలో ప్రియాంక అనే బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేగింది. అనంతరపురం జిల్లా పట్నం గ్రామానికి చెందిన ప్రియాంక మదనపల్లి గోల్డెన్ వ్యాలీ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతోంది.
గత కొంత కాలంగా సీనియర్ విద్యార్థి తనపై వేధిపులకు పాల్పడుతున్నారని కళాశాల ప్రిన్సిపాల్కి ఫిర్యాదు చేసింది. కాలేజీ యాజమాన్యం నిందుతులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. సోమవారం సాయంత్రం ఇంటికి తిరిగివస్తుండగా బస్సులో మరోసారి సీనియర్లు వేధించారు. దీంతో మనస్తాపం చెందిన ప్రియాంక జుట్టుకు వేసుకునే సూపర్ వాస్మాల్ తాగి బలవన్మరణానికి పాల్పడింది.
కాగా కళాశాల నిర్లక్ష్యం కారణంగానే తమ కుమార్తె చనిపోయిందనీ, కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని యువతి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. తమ కుమార్తెతో కలసి తాము గతంలో ఫిర్యాదు చేసినా కాలేజీ ప్రిన్సిపాల్ నిందితులపై చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.