ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు సీరియల్ కట్టర్ మాన్. గత వారం రోజులుగా మహిళలకు నిద్ర లేకుండా చేస్తూ మధ్యప్రదేశ్ పోలీసులకు సవాల్గా మారాడు. భోపాల్లో గత వారం రోజులుగా యువతుల్లో భయాందోళనలకు కారణమైన ‘సీరియల్ కట్టర్ మాన్’ను పోలీసులు అరెస్ట్ చేశారు.
పిప్లానీ, అయోధ్య నగర్ ప్రాంతాల్లో వరుసగా జరిగిన దాడులతో నగరమంతా భయవాతావరణం నెలకొంది. నిందితుడు ఆకస్మికంగా బ్లేడ్తో దాడులు చేసి పరారవుతూ ఉండటంతో తల్లిదండ్రులు తమ కుమార్తెలను సాయంత్రం తర్వాత బయటకు పంపడానికి భయపడ్డారు. కాలేజ్ విద్యార్థినులు తమ రోజువారీ రూటీన్లను కూడా మార్చుకోవాల్సి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నిందితుడు భార్యతో జరుగుతున్న నిరంతర గొడవల వల్ల మానసికంగా అస్థిరుడై, ఆ కోపాన్ని ఒంటరిగా నడుస్తున్న యువతులపై దాడుల రూపంలో బయటపెట్టాడని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ దాడులు పూర్తిగా ముందస్తు ప్రణాళికతో చేసినవి కాకుండా, ఆకస్మిక ఆవేశం ఫలితమని పోలీసులు తెలిపారు.
గురువారం రాత్రి 10:30 నుంచి 11 గంటల మధ్య పిప్లానీ ప్రాంతంలో రెండు, అయోధ్య నగర్ పరిధిలో ఒక దాడి జరిగింది. బాధితుల్లో ఇద్దరు కాలేజ్ విద్యార్థినులు, ఒక ఇంటర్మీడియట్ విద్యార్థిని ఉన్నారు. నిందితుడు ముఖానికి మాస్క్ ధరించి, నంబర్ ప్లేట్ లేని బైక్పై తిరుగుతూ దాడులు చేశాడు. వీధి దీపాలు పనిచేయకపోవడం అతడికి అనుకూలంగా మారింది.
ఆరు రోజుల పాటు 25కి పైగా పోలీస్ బృందాలు, సైబర్ సెల్, క్రైమ్ బ్రాంచ్ కలిసి విస్తృత దర్యాప్తు చేపట్టాయి. మినాల్ ప్రాంతంలోని 200కిపైగా సీసీటీవీ కెమెరాల ఫుటేజీ విశ్లేషణతో చివరికి నిందితుడిని పట్టుకున్నారు. అతడిని అరెస్ట్ చేయడంపై ₹20 వేల బహుమతి కూడా ప్రకటించారు. ప్రస్తుతం నిందితుడు పోలీస్ కస్టడీలో ఉండగా విచారణ కొనసాగుతోంది.
