ఈ మద్య రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. కారణాలు ఏవైనా ఈ ప్రమాదాల వల్ల ఎన్నో జీవితాలు నాశనం అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా కర్ణాటకలో రోడ్డు ప్రమాదం సంబవించింది. ఈ ప్రమాదంలో కేంద్ర రక్షణ, ఆయుష్ శాఖ సహాయమంత్రి శ్రీపాద నాయక్ భార్య విజయ, ఆయన వ్యక్తిగత కార్యదర్శి దీపక్ మృతి చెందారు.
కర్ణాటకలోని ఎల్లాపూర్ నుంచి గోకర్ణ వెళ్తుండగా ఉత్తర కన్నడ జిల్లా అంకుల సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తాపడింది. తీవ్రంగా గాయపడిన మంత్రి భార్య విజయ, పీఏ దీపక్లు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ప్రమాదం నుంచి మంత్రి ప్రాణాలతో బయట పడ్డట్టు పోలీసులు తెలిపారు.
కాగా, ప్రమాదం తెలుసుకున్న ప్రధాని నరేంద్రమోదీ గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్తో మాట్లాడి నాయక్ అత్యవసర చికిత్స అందించాలని ఆదేశించినట్లు సమాచారం. ఆయన ఆరోగ్యంగా రావాలని కోరినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే మంత్రి ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రాణాపాయం లేదని గోవా సీఎం ప్రమోద్ సావంత్ తెలిపారు.