వైసీపీ ఎన్నికల శంఖారావానికి సర్వం సిద్ధమైంది. 27న(రేపు) భీమిలి వేదికగా ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు వైసీపీ చీఫ్, సీఎం జగన్. వైసీపీ నేతలు, కార్యకర్తలు దాదాపు మూడు లక్షల మంది ఈ సదస్సుకు హాజరుకానుండగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు వైసీపీ నేతలు.
ఎన్నికలకు ముందు వైసీపీ నిర్వహిస్తున్న తొలి సదస్సు కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు నేతలు. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల నుంచి భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు. సీనియర్ నాయకులు వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్నాథ్ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
సీఎం జగన్ ఎన్నిలకు సంబంధించిన కీలక హామీలను ప్రకటించే అవకాశముందని పార్టీ నేతలు వెల్లడించారు. ఇప్పటి వరకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అమలు చేయడంతోపాటు వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తే ఏం చేస్తామన్న దానిపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు జగన్. పార్టీ కార్యకర్తలతో సీఎం జగన్మోహన్రెడ్డి మాటామంతీ నిర్వహించే అవకాశముండగా కొంత మంది కార్యకర్తలతో సీఎం ఇష్టాగోష్టిగా చర్చించడంతో పాటు స్థానికంగా ఉన్న ఇబ్బందులను తెలుసుకోనున్నారని తెలుస్తోంది. ఇక త్వరలో మేనిఫెస్టో విడుదల చేయనుండగా ఇందుకు సంబంధించిన ప్రకటన ఉండే అవకాశం ఉంది.
