జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు మరో షాక్ తగిలిందిజ. ఆ పార్టీ సీనియర్ నేతలు పసుపులేటి సందీప్ రాయల్,పద్మావతి రాజీనామా చేశారు. రాజకీయాల్లో మార్పు తెస్తామంటే పవన్ వెంట నడిచాం…కానీ పవన్ కల్యాణ్ను నమ్ముకుంటే నట్టేట ముంచాడని ఆరోపించారు. జనసేనకు రాజీనామా చేసిన అనంతరం వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన వారు పవన్పై తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ ప్రారంభం నుండి సేవ చేసిన తమని కాదని పారాషూట్ నేతలకు పవన్ ప్రాధాన్యం కల్పిస్తున్నారని మండిపడ్డారు.
దయచేసి పవన్ను నమ్మి ఎవరు జనసేనలో చేరవద్దని..అందరిని రోడ్డున పడేస్తాడని మండిపడ్డారు. పార్టీకి తొలి నుంచి సేవలు అందిస్తున్న మమ్మల్ని కాదని కోట రుక్మిణికి ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీని నమ్ముకుని పని చేస్తున్న 32మందిని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి గెంటేయడం న్యాయమేనా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.
పవన్కు రాష్ట్ర ప్రయోజనాలకంటే కూడా చంద్రబాబు ప్రయోజనాలే మఖ్యం అని…రాయలసీమలో జనసేన పార్టీలో బలిజలను రాజకీయంగా తొక్కేస్తున్నారు అని మండిపడ్డారు. పేద, బడుగు వర్గాలకు జగన్ ఇస్తున్న పథకాలు మేలు చేస్తున్నాయని…. అందుకే వైసీపీలో చేరామని తెలిపారు. జగన్ మరోసారి విజయం సాధించడం ఖాయం అని జోస్యం చెప్పారు.
జనసేనలో పవన్ కల్యాణ్ కు పసుపులేటి సందీప్ పర్సనల్ సెక్రటరీగా పని చేశారు. పసుపులేటి పద్మావతి జనసేన పార్టీ రాయలసీమ రీజియన్ సమన్వయకర్తగా పని చేశారు.