వార్తా ప్రసారాల్లో తన ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న కథనాలపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. తన ఆరోగ్యంపై ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు. “నేను పూర్తిగా ఆరోగ్యంగానే ఉన్నాను. సాధారణ రొటీన్ చెకప్లో భాగంగా ఆస్పత్రికి వచ్చాను తప్ప మరే సమస్య లేదు” అని తెలిపారు.
ఇటీవల కొన్ని మీడియా వర్గాల్లో ఆయనకు తీవ్ర అనారోగ్యం వచ్చినట్లు ప్రచారం జరగడంతో పార్టీ శ్రేణులు, అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో స్వయంగా స్పందించిన బొత్స సత్యనారాయణ అపోహలను ఖండించారు. వైద్యుల సూచన మేరకు ముందస్తు జాగ్రత్తగా పరీక్షలు చేయించుకోవడం సాధారణ ప్రక్రియేనని చెప్పారు.
తన ఆరోగ్యం గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దని మీడియాను కోరారు. తనకు మద్దతుగా నిలిచిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా జీవితంలో ఉన్నవారిపై నిర్ధారణ లేకుండా వార్తలు ప్రసారం చేయడం సరికాదని సూచించారు. త్వరలోనే సాధారణ కార్యక్రమాల్లో పాల్గొంటానని ఆయన వెల్లడించారు.
