తెలంగాణ ఎన్నికల్లో ఓటమికి కారణాలపై పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు బీజేపీ నేతలు. అధికారంలోకి వస్తామనే ధీమాతో బీజేపీ అగ్రనాయకులతో పాటు వివిధ రాష్ట్రాల సీఎంలను దించినా ఫలితం లేకపోయింది. కేవలం 8 స్థానాలకే బీజేపీ పరిమితం కాగా కీలక నేతలంతా ఓటమి పాలయ్యారు. బండి సంజయ్, ధర్మపురి అరవింద్తో పాటు పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓటమి పాలయ్యారు ఈటల రాజేందర్.
దీంతో ఇప్పుడు బీజేపీ ఓటమి ఈటల రాజేందర్ మెడకు చుట్టుకుంటోంది. వాస్తవానికి ఎన్నికలకు ఆరు నెలల ముందు అధ్యక్షుడిగా బండి సంజయ్ని మార్చింది బీజేపీ. బండి స్థానంలో కిషన్ రెడ్డిని నియమించగా దీనికి కారణం ఈటల రాజేందర్ అని ప్రచారం కూడా జరిగింది. దీనిపై బండి కూడా బహిరంగంగానే వ్యాఖ్యానించిన సందర్భాలున్నాయి.
ఇప్పుడు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఈటల టార్గెట్గా సోషల్ మీడియాలో బీజేపీ నేతలు రచ్చ చేస్తున్నారు. బండి సంజయ్ సారథిగా ఉండి ఉంటే కాంగ్రెస్ స్థానంలో బీజేపీ ఉండేదని కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీనికి ఈటల అనుచరులు సైతం ఘాటుగానే రిప్లై ఇస్తున్నారు. తన అనుచరులంటూ పదుల సంఖ్యలో టికెట్లు ఇప్పించుకుని వారిని గెలిపించుకోలేకపోయారని…చివరకు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఒక్క సీటును గెలిపించుకోలేదని మండిపడుతున్నారు. అంతేగాదు ఒకడుగు ముందుకేసి ఈటల, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్ ఓడిపోయేలా బండి సంజయ్ పనిచేశారని విమర్శిస్తున్నారు. మొత్తంగా సోషల్ మీడియాలో బీజేపీ నేతల మధ్య జరుగుతున్న రచ్చ ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.