ఈ నెల 28వ తేదీ నుంచి ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయిలో ఉద్యమ కార్యక్రమాలు చేపట్టనుంది. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా నిరసన కార్యక్రమాలు, పాదయాత్రలు, గ్రామసభల నిర్వహణకు కార్యాచరణ రూపొందించారు.
పర్యటనలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో రెండు గ్రామ పంచాయతీల్లో మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేయనున్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ పేదలకు కలిగిన ప్రయోజనాలు, గాంధీజీ ఆశయాలు, కాంగ్రెస్ ప్రభుత్వాల కృషిని ప్రజలకు వివరించనున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యగా పేర్కొంటూ, దీనిపై గ్రామస్థాయిలో అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామసభలు ఏర్పాటు చేసి ప్రజలతో నేరుగా చర్చలు జరపనున్నారు. ఈ గ్రామసభల్లో ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జి మీనాక్షి నటరాజన్తో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొననున్నారు. గ్రామీణ ఉపాధి, రైతుల సమస్యలు, కేంద్ర ప్రభుత్వ విధానాలపై కాంగ్రెస్ పార్టీ వైఖరిని వివరించనున్నారు. ఈ ఉద్యమం ద్వారా గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం కావడంతో పాటు, కేంద్రంపై ఒత్తిడి పెంచడమే లక్ష్యమని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు.
