ఏపీ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా పొత్తు పేరుతో కూటమిగా టీడీపీ-బీజేపీ-జనసేన ఏర్పడగా పొత్తులో విచిత్ర పరిస్థితులు జరుగుతున్నాయి. బీజేపీ నేతకు టిడిపి టికెట్ ఇవ్వగా తాజాగా టీడీపీ నేతకు బీజేపీ టికెట్ దక్కనుంది. అభ్యర్థుల మార్పుపై టీడీపీలో అసమ్మతి చల్లారలేదు. మడకశిర నుండి సునీల్ కుమార్ను తప్పించడంపై ఆయన అనుచరులు భగ్గుమన్నారు. చంద్రబాబు నమ్మించి మోసం చేశాడంటూ చంద్రబాబు, లోకేశ్ ప్లెక్సీలను పార్టీ కార్యకర్తలు తగలబెట్టారు. మోసకారి చంద్రబాబు అంటూ పార్టీ జెండాలను, ప్లెక్సీలను చెప్పులతో కొట్టారు.
5 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను మార్చారు చంద్రబాబు. ఇక రెండు స్థానాలు దెందులూరు, తంబళ్లపల్లె బీ ఫామ్ పెండింగ్లో పెట్టారు. అనపర్తి సీటు విషయంలో క్లారిటీ వచ్చాక ఈ రెండు స్థానాల్లో అభ్యర్థులకు బీ ఫామ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అనపర్తి టికెట్ ఆశించిన టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ తరపున పోటీచేసే అవకాశం ఉంది. నల్లమిల్లి బీజేపీలోచేరి కూటమి మద్దతుతో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు.
ఉండి నియోజకవర్గం అభ్యర్థిగా రఘురామ కృష్ణంరాజును ప్రకటించగా మంతెన రామరాజు మద్దతుదారులు ఆందోళనకు దిగారు. దీంతో ఆయన్ని బుజ్జగించేందుకు మంతెన రామరాజును నరసాపురం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడిగా, ఇప్పటివరకు పార్లమెంట్ అధ్యక్షురాలిగా కొనసాగిన మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మిని పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు.