ఏపీలో టీడీపీ – జనసేన పొత్తు తర్వాత ఈ రెండు పార్టీల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఎవరికి టికెట్ దక్కుతుందో ఎవరికి దక్కదో తెలియని పరిస్థితి. రెండు పార్టీ మధ్య సమన్వయం కోసం కమిటీ వేసినా ముందుంది ముసళ్ల పండగ అన్నట్లు, ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు తయారైంది.
ఎందుకంటే టీడీపీ ఎక్కడైతే బలంగా ఉందో అక్కడ జనసేన నేతలు పోటీకి సిద్ధం అవుతున్నారు. పోటీలో భాగంగా సీట్లు అడుగుతున్నారు.దీంతో టీడీపీ నేతలకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఓ వైపు 40 సంవత్సరాల ఇండస్ట్రీ కలిగిన పార్టీ టీడీపీ…మరోవైపు 10 సంవత్సరాల ఇండస్ట్రీ కలిగిన పార్టీ జనసేన. ఇరు పార్టీల నేతల మధ్య సయోధ్య కుదర్చడం తలనొప్పిగా మారింది.
ముఖ్యంగా రాయలసీమలో ఈ పోరు తారాస్ధాయికి చేరింది. సీమలో మెజార్టీ సీట్లలో పోటీ చేయాలని జనసేన పోటీ చేయాలని భావిస్తుండగా దీనిని టీడీపీ నేతలు ఖండిస్తున్నారు. జనసేనకు సీమలో సీట్లు కేటాయించడం వల్ల వైసీపీకే మేలు జరుగుతుందని కాబట్టి ఆలోచించాలని టీడీపీ అగ్రనాయకత్వాన్ని కోరుతున్నారు. ప్రధానంగా తిరుపతి,చిత్తూరు,శ్రీకాళహస్తి,ఆలూరు,ఆళ్లగడ్డ,అనంతపూర్,పుట్టపర్తి,రాజంపేట,,రైల్వే కొడూరు స్ధానాలను జనసేన కోరుతుండగా ఈ నియోజకవర్గాల్లో టీడీపీ బలంగా ఉంది. దీంతో వీటిలో ఏ ఒక్క స్ధానాన్ని జనసేనకు కేటాయించినా అక్కడ ఓడిపోవడం ఖాయమని అభిప్రాయపడుతున్న తెలుగుదేశం నేతలు. మొత్తంగా ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది టీడీపీ – జనసేన మధ్య పొత్తుల వ్యవహారం, అసంతృప్త నేతలను ఓ దారిలోకి తేవడం తలకు మించిన భారమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.