ఏపీలో టీడీపీ – జనసేన కలిసి పోటీచేస్తుండగా తెలంగాణలో జనసేన – బీజేపీ కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఏపీ సంగతి పక్కన పెడితే తెలంగాణలో జనసేనతో పొత్తు కోసం బీజేపీ వెంపర్లాడటం మాత్రం అందరిని ఆశ్చర్య పరిచింది. ఎందుకంటే తెలంగాణలో జనసేనకు నాయకులు తప్ప క్యాడర్ లేదు. అంతకమించి కమిటీలు లేవు. పవన్ ఫ్యాన్ ఫాలోయింగ్, అది ఏ మేరకు ఓటింగ్గా మారుతుందో చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో జనసేనతో పొత్తుకు బీజేపీ అధిష్టానం స్ధాయిలో పైరవీ నడిచింది. తీరా పొత్తు పొడిచింది కానీ అసలు సమస్య ఇప్పుడే స్టార్ట్ అయింది.
జనసేన ఇప్పటికే 32 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించగా ఇందులో బీజేపీ బలంగా ఉన్న స్థానాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా శేరిలింగంపల్లి, కూకట్పల్లి. ఈ రెండు స్థానాల్లో గెలుపును నిర్ణయించేది సెటిలర్లే. దీంతో ఇప్పుడు ఈ నియోజకవర్గాలే సమస్యగా మారాయి. మాకంటే మాకని బీజేపీ – జనసేన పట్టపట్టుకుని కూర్చుకున్నాయి. ఇక బీజేపీ నేతలు ఒకడుగు ముందుకేసి జనసేనకు కేటాయించవద్దని ఆ పార్టీ ఆఫీసులో రచ్చరచ్చ చేశారు.
ఈ రెండు నియోజకవర్గాల్లోనూ పోటీచేసేందుకు బీజేపీ నేతలు ఐదేళ్ళుగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో ఈ స్థానాలను జనసేనకు కేటాయిస్తే భగ్గుమనడం ఖాయం. అదేసమయంలో పవన్ సైతం ఈ రెండు నియోజకవర్గాలను వదులుకునేందుకు సిద్ధంగా లేరని సమాచారం. దీంతో అసలు తెలంగాణలో జనసేనతో పొత్తు ఎందుకు…?ఈ కొట్లాట ఎందుకని కమలనాథులు వాపోతున్నారు. మరి ఈ రెండు పార్టీల మధ్య సీట్ల పంపకం ఓ కొలిక్కి వస్తుందా లేదో వేచిచూడాలి.