తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర ట్రెండ్ కొత్తేమీ కాదు. ఇటు ఏపీలో అయినా అటు తెలంగాణలో అయినా వైఎస్ దగ్గరి నుండి చంద్రబాబు, రేవంత్ రెడ్డి, జగన్, లోకేష్ ఇలా నేతలంతా పాదయాత్రలు చేసి అధికారంలోకి వచ్చిన వారే. అయితే ఎంతమంది పాదయాత్ర చేసినా ఆ ట్రెండ్ సెట్ చేసింది మాత్రం వైఎస్ఆరే. రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర ఇప్పటికి ఎప్పటికి ప్రజల గుండెల్లో నిలిచిపోతుంది. మాట ఇస్తే మడమ తిప్పని నేతగా వైఎస్ను నిలబెట్టింది. ఆ తర్వాత హైలైట్గా నిలిచింది జగన్ యాత్ర.
ఇక తాజాగా జగన్ త్వరలో ప్రజాయాత్ర ద్వారా మళ్లీ ప్రజల ముందుకురానున్నారు. గతంలో తనను అధికారంలోకి తీసుకొచ్చిన పాదయాత్రనే మరోసారి నమ్ముకోనున్నారు జగన్. ఇందుకోసం 2027 సంవత్సరం నుంచే ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు వైసీపీ చీఫ్.
ఇప్పటికే తాను 2027లో చారిత్రాత్మక పాదయాత్రను ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు జగన్. ఈ యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ దాదాపు రెడీ అయినట్లు తెలుస్తోంది. దీంతో వచ్చే రెండేళ్లు అంటే 2029 అసెంబ్లీ ఎన్నికల వరకు జగన్ నిరంతరం ప్రజల్లోనే ఉండబోతున్నారు.
జగన్ చేపట్టబోయే యాత్రం ఏపీ రాజకీయాల్లో ఇది అత్యంత కీలకమైన పరిణామంగా మారనుంది. గతంలో పాదయాత్ర చేసిన అనుభవం, ఏ చిన్న పొరపాట్లు లేకుండా కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టనున్నారు జగన్. ఇక జగన్ చేపట్టబోయే ఈ యాత్ర వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపనుండగా .. ప్రజల్లో ఎలాంటి ఇమేజ్ క్రియేట్ చేయగలుగుతారు? మళ్లీ వైసీపీకి పూర్వ వైభవాన్ని తెచ్చిపెడతాయా? లేదా? అన్నది వేచిచూడాలి.
