ఏపీలో ప్రస్తుతం దొంగ ఓట్ల పంచాయితీ నడుస్తోంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ రెండు పార్టీలు ఒకరిపై ఒకరు నకిలీ ఓట్లు, ఓట్ల గల్లంతుపై ఈసీకి ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ పంచాయితీకి తోడు డబుల్ ఓటర్లకు చెక్ పెట్టాలని ఈసీని కోరింది వైసీపీ. దీంతో డబుల్ ఓట్లు కలిగిన వారి లెక్క తీసేందుకు సిద్దమైంది ఈసీ. ఇందుకు సంబంధించి ఇప్పటికే మీడియాలో ప్రకటనలు కూడా ఇస్తోంది.
ఏపీలో ఓటు హక్కు కలిగిన కొంతమంది ప్రజలు…తెలంగాణ, కర్నాటకలో కూడా ఓటు హక్కు కలిగి ఉన్నారని..అలాంటి ఓట్లను తొలగించాలని ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు. తెలంగాణలో ఎన్నికలు పూర్తి కావడంతో వారంతా ఏపీలో ఓటు వేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారని వారికి అడ్డుకట్ట వేయాలని కోరారు. ఇలా ఏపీ -తెలంగాణలో ఓటు హక్కు కలిగిన వారు దాదాపు 5 లక్షల మంది ఓటర్లు న్నారని వారిని గుర్తించి బోగస్కు చెక్ పెట్టాలని విన్నవించారు. దీంతో డబుల్ ఎంట్రీ ఓట్లపై కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది ఈసీ. ఒకవేళ తనకు ఓటు ఉందనే విషయాన్ని దాచి పెట్టి కొత్తగా ఓటు కోసం నమోదు చేసుకున్నట్లయితే సెక్షన్ 31 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు సూచించింది.
దీంతో డబుల్ ఎంట్రీ ఓట్లు ఉన్న వారిలో కదలిక మొదలైంది. కొంతమంది స్వచ్చందంగా ఒక చోట ఓటు హక్కును వదిలించుకునేందుకు ముందుకు వస్తుండగా మరికొంతమంది మాత్రం వేచిచూసే ధోరణిలోనే ఉన్నారు. 1950 ప్రజాప్రాదినిధ్య చట్టం సెక్షన్ 17,18 ప్రకారం ఒక వ్యక్తి ఒకచోట మాత్రమే ఓటర్ గా నమోదు చేయించుకోవాలి. అంతకు ముందు ఓటు ఉంటే దాన్ని మార్పు చేసుకోవడం కోసం ఫారం – 8 మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేస్తోంది. కానీ రెండు చోట్ల ఓట్లు వేస్తుండటంతో గెలుపు ఓటములపై ప్రభావం చూపుతోంది. దీంతో ఇకపై రెండు చోట్ల ఓటు ఉన్న వారు స్వచ్చందంగా ఏదో ఒక చోట వదులుకోవడమే ఉత్తమం. లేకుంటే ఈసీ తీసుకునే చర్యలకు బాధ్యులు కావడం ఖాయం.
