వరదలతో ఏపీ అతలాకుతలమైన సంగతి తెలిసిందే .ఈ నేపథ్యంలో మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ పిలుపుతో రంగంలోకి దిగాయి వైసీపీ శ్రేణులు. ప్రధానంగా విజయవాడ వ్యాప్తంగా వరద బాధితులకు అండగా నిలుస్తున్నారు. పెద్ద ఎత్తున బాధితులకు సహాయ సహకారాలు అందించడంలో నిమగ్నమయ్యారు.
ఇవాళ వరద ప్రభావిత ప్రాంతాల్లో లక్ష పాల ప్యాకెట్లు, రెండు లక్షల మంచినీళ్ల బాటిళ్లను వైసీపీ నాయకులు పంపిణీ చేశారు. తీవ్ర వరదలతో అతలాకుతలమైన సింగ్ నగర్ లో ఇంటింటికీ వెళ్లి పాలప్యాకెట్లు, వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు. దీంతో బాధితుల కళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. విజయవాడ నగరంలోని 16,17వ డివిజన్లలో ఉదయం నుండే పాల ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ పంపిణీ చేసి వారిలో ధైర్యం నింపారు వైసీపీ నేతలు. దీంతో స్థానికులు వైసీపీ నేతలపై ప్రశంసలు గుప్పించారు.
ఇప్పటికే వరద బాధితుల సహాయార్థం పార్టీ తరఫున జగన్ కోటి రూపాయలు సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. వరద బాధితులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తున్నారు బాధితులు. మూడు రోజులుగా కనీసం తాగడానికి నీళ్లు లేక అలమటిస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు.
