కూటమి నేతల కనుసన్నల్లోనే యూరియా బ్లాక్ దందా నడుస్తోందని మండిపడ్డారు వైసీపీ సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి. 9న రాష్ట్ర వ్యాప్త ఆందోళనలతో ప్రభుత్వం కళ్ళు తెరిపిద్దాం అన్నారు. తాడేపల్లి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎరువుల బ్లాక్ మార్కెట్ పై ‘అన్నదాత పోరు’ పోస్టర్ను ఆవిష్కరించారు.
యూరియా అడిగిన రైతులపై సర్కార్ వేధింపులకు పాల్పడుతోందని… రాష్ట్రంలో అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు దూరం అన్నారు. అన్నదాత గోడును పట్టించుకోని దుర్మార్గపు ప్రభుత్వం…. రైతులతో కలిసి ఆందోళనలతో ప్రభుత్వ మెడలు వంచుదాం అన్నారు.
రైతులకు కనీసం అవసరమైన మేరకు యూరియాను కూడా అందించలేని ఒక అసమర్థ పాలనను చూస్తున్నామని మండిపడ్డారు. యూరియా బ్లాక్ మార్కెటింగ్ని అరికట్టి ఎమ్మార్పీ ధరలకే రైతులందరికీ సక్రమంగా పంపిణీ చేయాలి అన్నారు. వైసీపీ గత అయిదేళ్ళ పాలనలో రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో ఎన్నో విప్లవాత్మక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆయన పాలనలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో ఎప్పుడూ లేనివిధంగా వ్యవసాయం రంగంలో వినూత్న మార్పులు చోటు చేసుకున్నాయి అన్నారు.
2014-19 మధ్య టీడీపీ హయాంలో ఉన్న దారుణమైన పరిస్ధితులను 15 నెలల్లోనే తీసుకొచ్చారు. ఎరువులను అక్రమంగా నిల్వచేసి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. రైతులే రోడ్డెక్కి ప్రశ్నిస్తుంటే వారికి వైయస్ఆర్సీపీ ముద్ర వేయడం, బొక్కలో వేస్తామని రైతుల్ని సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి చంద్రబాబు బెదిరిస్తున్నారు అన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏడాదిన్నర పాలనలో ఏనాడూ రైతులను ఆదుకునే చిన్న ప్రయత్నం కూడా చేయలేదు… వ్యవసాయాన్ని గాలికొదిలేసిందే కాకుండా యూరియా ఎక్కువ వాడితే కేన్సర్ వస్తుందని ముఖ్యమంత్రి ఉచిత సలహాలిస్తున్నాడు అన్నారు.
