ఆయన వెండితెరపై ఓ వెలుగు వెలిగిన మహానటుడు. ఏడు పదుల వయసులో కూడా జాతీయ అవార్డును సొంత చేసుకున్న వాడు. ఆయనే బిగ్ బి అమితాబ్ బచ్చన్. అంతటి మహా నటుడ్ని కూడా కొన్ని చీకటి రోజులు వేధించాయట. ఆ సమయంలోనే నరకం ఎలా ఉంటుందో తాను, తన కుటుంబ సభ్యులు చూశారని బిగ్ బి తన ట్విట్టర్ లో పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన బోఫోర్స్ కుంభకోణంలో తన కుటుంబాన్ని లాగి పాతికేళ్ల పాటు నరకం చూపించారని ఆయన వాపోయారు. తన జీవితంలో ప్రతి చిన్న విషయంపై కూడా మరకలు పడేలా పతాక శీర్షికల్లో రాసారని ట్విట్ చేశారు. నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో ఎవరు ఎవరిపై ఆరోపణలు చేసినా అవి తారాజువ్వల కంటే వేగంగా వెళ్లిపోతున్నాయని, ఏది నిజం.. ఏది అబద్దం అన్నది కూడా ప్రజలు తెలుసుకోలేకపోతున్నారని అమితాబ్ పేర్కొన్నారు.
బోఫోర్స్ కుంభకోణం నుంచి 2012 సంవత్సరంలో స్వీడిష్ ప్రభుత్వం అమితాబ్ కు, ఆయన కుటుంబానికి క్లీన్ చిట్ ఇచ్చింది. అయినా కొన్నాళ్ల పాటు ఆ నీలి నీడలు మాత్రం తనను, తన కుటుంబాన్ని వదలలేదని అమితాబ్ ఆవేదన చెందారు. ఇన్నాళ్ల తమ బాధను ఇప్పుడు ఎవరైనా తొలగించగలరా… ఆ మరకల్ని చెరపగలరా అని ఆయన ప్రశ్నించారు.