హిందీ ఫీచర్ ఫిల్మ్ Kerala Story 2 – Goes Beyond కు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఇచ్చిన సర్టిఫికేషన్ను సవాల్ చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్పై విచారణ జరిపిన కేరళ హైకోర్టు గురువారం చిత్ర నిర్మాతలకు నోటీసులు జారీ చేసింది.
టీజర్, ట్రైలర్పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్ను పరిగణలోకి తీసుకుంటూ కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. పిటిషనర్ వాదన ప్రకారం, చిత్ర ప్రచార సామగ్రిలో పలు రాష్ట్రాల మహిళలను సంబంధాల పేరుతో మోసం చేసి మతమార్పిడికి బలవంతం చేస్తున్నట్లు చూపుతున్నప్పటికీ, కథ అనేక రాష్ట్రాలకు సంబంధించినదైనా సినిమా టైటిల్ మాత్రం ఉగ్రవాదం, బలవంతపు మతమార్పిడి, జనాభా కుట్ర వంటి అంశాలను కేవలం కేరళతోనే అనుసంధానిస్తున్నట్లు ఉందని పేర్కొన్నారు.
టీజర్ చివర్లో వినిపించే “అబ్ సహేంగే నహీ… లడేంగే (ఇక సహించం… పోరాడతాం)” అనే హిందీ నినాదం ప్రతీకార చర్యలకు పిలుపునిచ్చేలా ఉండి సామాజిక ఉద్రిక్తతలకు దారితీయవచ్చని పిటిషన్లో పేర్కొన్నారు.
సినీమాటోగ్రాఫ్ చట్టం, 1952లోని సెక్షన్ 5బి కింద ఉన్న ప్రజా శాంతి, మర్యాద, నైతికతకు విరుద్ధమైన లేదా నేరాలకు ప్రేరేపించే చిత్రాలకు సర్టిఫికేషన్ ఇవ్వకూడదనే నిబంధనలను సక్రమంగా పాటించలేదని ఆరోపించారు.వ్యక్తి స్వేచ్ఛ (ఆర్టికల్ 19(1)(a)) రాజ్యాంగ పరిరక్షణ పొందినప్పటికీ, ప్రజా శాంతి దృష్ట్యా సముచిత పరిమితులు విధించవచ్చని పిటిషన్ స్పష్టం చేసింది. అలాగే భారతీయ న్యాయ సంహిత, 2023లోని సెక్షన్లు 196, 197 ప్రకారం ఈ కంటెంట్ మత, ప్రాంతీయ వర్గాల మధ్య విద్వేషాన్ని ప్రేరేపించే అవకాశం ఉందని వాదించారు.
సర్టిఫికేషన్ను రద్దు చేయాలని, టైటిల్ మరియు డిస్క్లైమర్లను పునఃపరిశీలించాలని, తదుపరి సమీక్ష పూర్తయ్యే వరకు సినిమా విడుదలను నిలిపివేయాలని పిటిషనర్ కోరారు. కేసు తదుపరి విచారణను మంగళవారం నిర్వహించనున్నారు.
