వినాయక చవితి వేడుకలకు తెలుగు రాష్ట్రాలు సిద్దమయ్యాయి. ముఖ్యంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న గణపయ్యలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. అనకాపల్లి జిల్లా కేంద్రంలో ఈ ఏడాది వినాయక ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఎన్టీఆర్ క్రీడా మైదానం వద్ద 126 అడుగుల మట్టి గణపతిని సంపత్ వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ గణనాథుడి ప్రతిమ తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత భారీదని కమిటీ అధ్యక్షుడు బుద్ధ భూలోక నాయుడు తెలిపారు. గిన్నిస్ బుక్లో స్థానం పొందడమే లక్ష్యంగా ఈ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
వైఎస్సార్ కడప జిల్లా కలసపాడు సెయింట్ ఆంటోనీ పాఠశాలలో వినాయక చవితి సందర్భంగా విద్యార్థులు గణేశుడి ఆకృతిని ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. గణనాథుడు కదులుతున్నట్టుగా విద్యార్థులు పలు భంగిమలను ప్రదర్శించారు. వారి విన్యాసాలను చూసి ఉపాధ్యాయులు, గ్రామస్థులు ప్రశంసించారు. వెరైటీ.. సబ్బులు, శాంపూలతో వినాయకుడు
అనంతపురం జిల్లా పామిడిలో తయారుచేసిన విఘ్నేశ్వరుడి విగ్రహం అందర్నీ ఆకట్టుకుంటోంది. కాస్త భిన్నంగా సబ్బులు, శాంపూలతో ఈ విగ్రహాన్ని రూపొందించారు. సంతూర్, సింతాల్, లక్స్ సబ్బులతో పాటు శాంపూలు, కంఫర్ట్ ప్యాకెట్లను వినియోగించారు. సుమారు 25,000 ఖర్చయినట్లు నిర్వాహకులు తెలిపారు.
కర్ణాటకలోని కొప్పళ జిల్లా గంగావతి తాళ్లలోని శ్రీరామనగరం విద్యానికేతన్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు వినాయక చవితిని విభిన్న రీతిలో జరుపుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. నాలుగు వేల మంది విద్యార్థులు గణేశుడి ఆకృతిని ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు.. ఐదు వేల దీపాలను వెలిగించి అద్భుత ప్రదర్శనను నిర్వహించారు.
