చత్తీస్ గఢ్లో మావోఇస్టులు మరో సారి సీఆర్పీఎప్ జవాన్లపై పంజా విసిరారు. సోమవారం మధ్యాహ్నం సుకుమా జిల్లా చింతగుహ సమీపంలోని 74వ సీఆర్పీఎఫ్ బెటాలియన్పై మావోయిస్టులు మెరుపుదాడి చేశారు.అనూహ్యంగా దాడిచేసిన ఘటనలో 24 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరనించారు. మరో ఏడుగురు గాయపడినట్టు సుకుమా అడిషనల్ ఎస్పీ జితేందర్ శుక్లా చెప్పారు. క్షతగాత్రులను చికిత్స కోసం హెలికాప్టర్లో సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.
అటవీ ప్రాంతంలో రోడ్డు పనులు జరుగుతున్న చోట ఉన్న జవాన్లపై దాదాపు 300 మంది మావోయిస్టులు అకస్మాత్తుగా దాడి చేసి రెండువైపులా కాల్పులు జరిపారు. మావోయిస్టులకు, సీఆర్పీఎఫ్ జవాన్లకు మధ్య భీకరంగా కాల్పులు జరిగాయి. మావోయిస్టులు పెద్ద ఎత్తున ఆయుధాలను ఎత్తుకెళ్లినట్టు సమాచారం. ఈ ఘటన అనంతరం జవాన్లు కూంబింగ్ ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. చత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ వెంటనే మంత్రులు, పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. ఈ ఏడాది మొదట్లో ఇదే జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 12 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు.
ఎన్కౌంటర్లో క్షతగాత్రులైన సీఆర్పీఎఫ్ సిబ్బందిని హెలికాప్టర్లో రాయ్పూర్, జగ్దల్పూర్ ఆసుపత్రులకు తరలించారు. పక్కా ప్లానింగ్, సమాచారంతోనే మావోయిస్టులు ఈ మెరుపు దాడికి పాల్పడినట్టు ఆసుపత్రులో చికిత్స పొందుతున్న సీఆర్పీఎఫ్ జవాన్ షెర్ మహ్మద్ తెలిపారు. తొలుత తామున్న ప్రదేశాన్ని తెలుసుకునేందుకు గ్రామస్థులను నక్సల్స్ వినియోగించినట్టు చెప్పారు. దాడి జరిగిన సమయంలో తాము 150 మంది ఉండగా, నక్సల్స్ 300 మంది వరకూ ఉన్నట్టు మహ్మద్ చెప్పాడు. తాము కూడా దీటుగానే కాల్పులు జరిపామన్నారు. తాను అతి సమీపం నుంచి 3 నుంచి నలుగురు నక్సల్స్పై కాల్పులు జరిపినట్టు చెప్పారు. తమ ఎదురుకాల్పుల్లో మృతిచెందిన నక్సల్స్ సంఖ్య కూడా ఎక్కువే ఉండొచ్చని అన్నారు.
ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు జరిపిన దాడిలో 24 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది మృతిచెందిన సమాచారం తెలియగానే ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ఢిల్లీ పర్యటన ముగించుకుని వెంటనే రాయ్పూర్ బయలుదేరారు. ప్రభుత్వ, పోలీసు ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. మరోవైపు, దాడి ఘటనను స్వయంగా తెలుసుకుని పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్సరాజ్ అహిర్ సైతం రాయ్పూర్ బయలుదేరారు.
Related