మహారాష్ట్రలోని గడ్చిరోలిలో మావోయిస్టులు దారుణానికి ఒడిగట్టారు. 16 మందితో వెళ్తున్న పోలీసు వాహనాన్ని మావోయిస్టులు ఐఈడీతో పేల్చివేశారు. ఈ పేలుడు ధాటికి వాహనం తునాతునకలైంది. ఈ సంఘటనలో 15 మంది పోలీసులు, డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గడ్చిరోలిలో గంటల వ్యవధిలోనే మావోయిస్టులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు.
జముర్ఖేడా సమీపంలోని కుర్కేడాలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో 16 మంది కమాండోలు ప్రయాణిస్తున్నారని సమాచారం. మందుపాతర పేల్చిన ప్రాంతంలో పోలీసులు, నక్సల్స్ మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో దాదాపు 200 మంది మావోయిస్టులు ఉన్నారని భావిస్తున్నారు.గడ్చిరోలి జిల్లాలోని కుర్ఖేడాలో రహదారి నిర్మాణ పనులకు సంబంధించిన 36 వాహనాలకు నక్సల్స్ నిప్పు పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఆ వాహనాలు పూర్తిగా కాలిపోయిన సంగతి తెలిసిందే.
ఇవాళ ‘మహారాష్ట్ర దినోత్సవం’ జరుపుకుంటున్న సమయంలో.. ముఖ్యులు ఎవరైనా ఉంటారని భావించిన మావోయిస్టులు దాడికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. కురికెడకు ఆరు కిలోమీటర్ల దూరంలో ఘటనా స్థలం ఉంది.