చత్తీస్గఢ్లో మావోయిస్టులు మరోసారి దుశ్చర్యకు పాల్పడ్డారు. దంతెవాడ జిల్లా ఆరాన్పూర్లో మావోయిస్టులు జరిపిన మెరుపుదాడిలో దూరదర్శన్ కెమెరామెన్తో పాటు ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు జవాన్లకు తీవ్రగాయాలయ్యాయి. నవంబర్ 12న ఎన్నికలు జరగనున్న ఎన్నికల నేపథ్యంలో మావోలు రెచ్చిపోతున్నారు.
ఛత్తీస్ గఢ్ అసెంబ్లీకి నవంబర్ 12, 20న రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే మూడ్రోజుల క్రితం బీజాపూర్ జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్ల ల్యాండ్ మైన్ ప్రూఫ్ వాహనాన్ని మందుపాతరతో పేల్చేశారు. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే చనిపోగా, మరో జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు.
మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టిన సమయంలో దాడి జరిగినట్లు ఎస్పీ అభిషేక్ పల్లవ్ తెలియజేశారు. మావోల దాడిలో దూరదర్శన్ కెమెరామెన్, ఇద్దరు భద్రతా సిబ్బంది చనిపోయినట్టు చత్తీస్గఢ్ డీఐజీ సుందర్రాజ్ ధ్రువీకరించారు.