పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వెలువడిన అతి కొద్ది రోజులలోనే తన కూతురు వివాహం చాలా ఘనంగా నిర్వహించి నేషనల్ మీడియా దృష్టిలో పడిన గాలి జనార్ధన్ రెడ్డి ఎక్కడా తగ్గలేదు. తన కూతురు పెళ్లిని అందరికీ షాక్ ఇచ్చే రీతిలో అది కూడా పెద్ద నోట్ల రద్దు టైం లో చేసి ఛాలెంజ్ చేసాడు ఆయన.
అయితే ఆయన పెళ్లి ని పాత నోట్లతో ఎలా చేసాడు అనేది పెద్ద ప్రశ్న. గాలి ఆ సమయంలోనే రూ.100 కోట్ల రూపాయల దాకా బ్లాక్ మనీని వైట్ గా మార్చాడట. ఈ వ్యవహారంలో గాలికి సహకారం అందించి.. అతడి నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని.. చివరికి అతను ఒత్తిడి భరించలేక ఆత్మహత్యే చేసుకున్నాడు. ఆ వ్యక్తి పేరు రమేష్. భీమా నాయక్ అనే అధికారి దగ్గర డ్రైవర్ గా పని చేసే రమేష్.. గాలి జనార్దన రెడ్డి వంద కోట్ల రూపాయల బ్లాక్ మనీని వైట్ గా మార్చారని.. ఇందులో తన పాత్ర కూడా ఉందని.. 20 పర్సంట్ కమిషన్ తో నోట్ల మార్పిడికి తాను సహకరించానని రమేష్ తన సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు.
ఐతే ఈ క్రమంలో గాలి జనార్దన రెడ్డితో పాటు తాను డ్రైవర్ గా పని చేస్తున్న అధికారి తనను టార్చర్ చేశారని.. తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని రమేష్ పేర్కొన్నాడు. ఈ నోట్ ఆధారంగా పోలీసులు గాలిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. మరోవైపు గాలి కూతురి పెళ్లి అనంతరం ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించి.. ఆయన్ని విచారిస్తున్న సంగతి తెలిసిందే. తాజా ఆరోపణల నేపథ్యంలో గాలి చుట్టూ ఉచ్చు బిగుసుకునేలా కనిపిస్తోంది.