ఎన్నికల ఫలితాల తరువాత టీడీపీ పార్టీ రెంగా చీలిపోతుందని భాజాపా ఎమ్మెల్సీ మాధవ్ జోష్యం చెప్పారు.నిజమైన టీడీపీ కార్యకర్తలు తిరుగుబాటు చేయనున్నారని తెలిపారు. నారావారి పార్టీ, నందమూరి వారి పార్టీగా టీడీపీ చీలనుందన్నారు. రాష్ట్రంలో సైకిల్ టైరులో గాలిలేదని, ఎక్కడ ఉండాలో అక్కడే ఉందని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు రాష్ట్రంలో స్థానం లేదు కాబట్టే జాతీయ స్థాయిలో ఉనికి కోసం తాపత్రయం పడుతున్నారని ఎద్దేవ చేశారు.
ఎన్నికల సమయంలో ప్రజాశాంతి పార్టీతో కుమ్మక్కైన చంద్రబాబు కొత్త డ్రామా ఆడారని ఆరోపించిన బీజేపీ ఎమ్మెల్సీ… మరోవైపు డేటా చోరీ గురించి విచారణ ముందుకు వెళ్లలేదన్నారు. ఏపీ మాజీ సీఎస్ పునేఠ తొలగింపుకు కారణం ఎవరో అందరికి తెలుసునన్నారు. వైఎస్ జగన్ గెలుపుకి చంద్రబాబె తోడ్పడ్డారని తెలిపారు.
ప్రజాశాంతి పార్టీ పేరుతో రాయలసీమలో చంద్రబాబు కుట్రలు చేశారని ఆరోపించారు. చంద్రబాబు ధోరణి దొంగే దొంగా అన్నట్టు ఉందని, డేటా చోరి కేసులో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న చంద్రబాబును ఎన్నికల సంఘం విచారించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో మరోసారి భాజాపా అధికారంలోకి వస్తుందన్నారు.