ఏపీలో మంత్రివర్గ విస్తరణకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముహూర్తం ఖరారు చేశారు. ఈనెల 11న మంత్రి వర్గ పునర్ వ్యవస్తీకరణ చేయాలని బాబు నిర్ణయం తీసుకున్నారు. ఎన్డీయే నుంచి టీడీపీ వైదొలగిన తర్వాత రాష్ట్రంలోని ఇద్దరు బీజేపీ మంత్రులు కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. కామినేని శ్రీనివాస్, మాణిక్యాల రావు తప్పుకొన్నారు. వారి స్థానాలు కొత్త వారితో భర్తీ చేయనున్నారు.
సార్వత్రిక ఎన్నికలు కూడా ఎంతో దూరం లేకపోవడంతో అన్ని వర్గాలను బేరీజు వేసుకొని మంత్రి వర్గ విస్తరణ చేపడుతున్నారు. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం రెండు పదవుల్లో ఒకటి మైనారిటీలకు, మరొకటి ఎస్టీలకు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం.
గిరిజనుల్లో ఇటీవలే మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన ఫిరాయింపు ఎంఎల్ఏ కిడారి సర్వేశ్వరరావు కొడుకు కిడారి శ్రవణకుమార్, మైనారిటీల్లో ఎన్ఎండి ఫరూక్ కు మంత్రి పదవులు ఇవ్వాలని బాబు భావిస్తున్నారు. ఇప్పటి వరకూ బాబు క్యాబు నేట్లో మంత్రిగా అత్యంత పిన్న వయస్కురాలు అఖిల ప్రియ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ ప్లేస్ను దక్కించుకోబోతున్నాడు దివంగత అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుమారుడు శ్రావణ్ కుమార్.
ఇక శ్రావణ్ విషయానికి వస్తే… 1990 జూన్ 14వ తేదీన జన్మించిన ఆయన ఒకటి నుంచి 8వ తరగతి వరకు పెదబయలు సెయింట్ ఆన్స్ స్కూల్లో.. 9, 10 తరగతులు పార్వతీపురంలోని స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్లో చదివారు.. ఇంటర్మీడియట్ను విశాఖలోని నారాయణ కాలేజీలో అభ్యసించారు.. వారణాసి ఐఐటీలో మెటలార్జీ చేశారు.
శ్రావణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే.. అఖిలకన్నా పిన్న వయస్కుడైన మినిస్టర్గా రికార్డులకు ఎక్కుతారు. భూమా అఖిలప్రియ 1989లో జన్మించగా.. శ్రావణ్ 1990లో పుట్టారు. కిడారి కొడుకును మంత్రి వర్గంలోకి తీసుకుంటున్న నేపథ్యంలో అనుచరులు, టీడీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.