మంత్రివర్గ పునర్వ్యవస్తీకరణపై సీఎం జగన్ తుది కసరత్తు చేస్తున్నారు. సీఎంతో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. కేబినెట్ విస్తరణలో సమాలోచనలు జరిపారు. కొత్తగా ప్రమాణస్వీకారం చేపట్టనున్న మంత్రులకు ఆదివారం సాయంత్రంలోపు అధికారికంగా లేఖలు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లేఖలు వెళ్లిన తర్వాత వ్యక్తిగతంగా సీఎంవో అధికారులు ఫోన్లు చేసి సమాచారం ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. పాత కేబినెట్ నుంచి ఐదుగురికి చోటు ఉంటుందని మొదట ప్రచారం జరిగింది.
తాజాగా 8 నుంచి 10 మందిని కొనసాగించే అవకాశం ఉంది. కుల సమీకరణ, కొత్త జిల్లాలకు పరిగణనలోకి తీసుకుని మంత్రుల ఎంపిక ఉంటుందని అధికార, వైసీపీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం సోమవారం ఉదయం పదకొండున్నరకు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. బీసీ వర్గానికి చెందిన వారికి అధికంగా మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు.
2019 ఎన్నికల సమయంలో మంత్రి పదవులు ఇస్తానని హామీ ఇచ్చిన నేతలకు ఖచ్చితంగా చోటు ఉంటుందని తెలుస్తోంది. పార్టీ పెద్దల చుట్టూ ఆశావాహులు తిరుగుతున్నారు. తమకు మంత్రి పదవి దక్కేలా చూడాలంటున్నారు. ఇటీవల సమావేశమైన కేబినెట్లో మంత్రులంతా రాజీనామాలు చేశారు. రాజీనామా లేఖలను సీఎంకు అందజేశారు.