అనంతపురం జిల్లాలోని పలు నీటి పారుదల ప్రాజెక్టుల పనులు సకాలంలో పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశిచారు. జిల్లాలో సుడిగాలి పర్యటన చేసిన సిఎం చెర్లోపల్లి రిజర్వాయర్ ప్రాజెక్టు అధికారులతో సమీక్ష జరిపారు.
హంద్రీనీవా పనులు సాధ్యమైనంత త్వరగా జరగాలని ఆయన ఆదేశించారు. అధికారులు, కాంట్రక్టర్లు చిత్తశుద్ధితో చేయకపోతే ఇబ్బందుల్లో పడతారని హెచ్చరించారు. తను పని చేసే వారంటే ఎంతో గౌరవమని, అలాంటి వారే తనకు కావాలని అన్నారు. పనుల్లో ఎక్కడా నాణ్యత లోపించకూడదని, అలా చేసిన వారిని బ్లాక్ లిస్టులో పెడతామని సిఎం హెచ్చరించారు.
నదుల అనుసంధానం ద్వారా అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాలకు నీటిని తరలిస్తామని, సీమ జిల్లాలను సస్యశ్యామలం చేయడమే తన లక్ష్యమని ఆయన అన్నారు. ప్రతి పనిని విమర్శిస్తూ కూర్చుంటే పనులు కావని, పాజిటివ్ గా ఆలోచించడం నేర్చుకోవాలని ప్రతిపక్షాలనుద్దేశించి బాబు అన్నారు.
