మతాంతర ప్రేమ వివాహం కారణంగా అమ్మాయిపై ఆమె తల్లిదండ్రులే అత్యంత దారుణంగా వ్యవహరించారు. వేరే మతానికి చెందిన యువకుడ్ని ప్రేమించడం నేరమని గ్రామ పంచాయతీ తీర్పు చెప్పడంతో సొంత కూతురిపై తల్లిదండ్రులు దాడి చేశారు. చెట్టుకు కట్టేసి తీవ్రంగా హింసించారు. ఈ ఘటన బిహార్లోని నవాడా జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది.
జగియా మారన్ గ్రామానికి చెందిన మొహమ్మద్ ఫరీద్ అన్సారీ కూతురు (18) పొరుగూరుకు చెందిన రూపేష్ కుమార్ని ప్రేమించింది. ఇద్దరూ పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. యువతి ఈ విషయం ఇంట్లో వాళ్లకు చెప్పింది. అయితే వారు అందుకు అంగీకరించలేదు.
దాంతో గత నెల 30వ తేదీన ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. రూపేష్ ఇంటికి చేరుకుంది. కూతురు ఆచూకీ తెలుసుకున్న తల్లిదండ్రులు ఆమెను గ్రామ పంచాయతీలో నిలబెట్టారు. హిందూ మతస్తుడే కాకుండా మరో గ్రామానికి చెందిన వ్యక్తిని ప్రేమించడంతో యువతి తమ ఊరు పరువు తీసిందంటూ గ్రామ పంచాయతీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
యువతిని చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెడుతున్న విషయం పోలీసులకు తెలిసింది. వెంటనే స్పందించిన పోలీసులు యువతిని రక్షించారు. మళ్లీ ఇలాంటివి పునరావృతం కావొద్దని గ్రామ పంచాయతీ సభ్యులకు వార్నింగ్ ఇచ్చారు.