ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ప్రజా ప్రతినిధులు…తాము ఎక్కడ ఉన్నామో, ఏం చేస్తున్నామో అనే ఇంగిత జ్ఞానం మర్చిపోయారు. శిలా ఫలకంపై పేరు లేదంటూ మొదలైన చివరికి బీజేపీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యే బహిరంగంగా చెప్పులతో పరస్పరం కొట్టుకునేంతవరకూ వెళ్లింది. ఉత్తరప్రదేశ్ సంత్ కబీర్ నగర్ కలెక్టరేట్లో జరిగిన ఈ తతంగానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఉత్తర్ ప్రదేశ్లోని కరీబ్నగర్లో జరిగిన పర్యవేక్షణ కమిటీ సమావేశంలో అలాంటి ఘటనే చోటు చేసుకుంది. యూపీ మంత్రి అశుతోష్ టండన్ అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో.. కబీర్ నగర్ ఎంపీ శరద్ త్రిపాఠీ, మెహదావల్ ఎమ్మెల్యే రాకేశ్ సిన్హ్ మధ్య మాటామాటా పెరిగి.. పరిస్థితి కొట్టుకునేంత వరకు వెళ్లింది. కోపం తెచ్చుకున్న ఎంపీ.. బూటుతో ఎమ్మెల్యేను చితక్కొట్టారు. దీంతో తిరగబడిన ఎమ్మెల్యే ఎంపీని కూడా రెండు దెబ్బలు వేశారు. వారిద్దరి మధ్యనే మంత్రి అశుతోష్ టండన్ కూర్చుని ఉన్నారు. ఆయన సమక్షంలో వీరిద్దరూ బాహాబాహికి తిగడం విశేషం. సొంత పార్టీ ఎమ్మెల్యేపై బీజేపీ ఎంపీ.. బూటుతో దాడి చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మల్యే అనుచరులు.. ఎంపీని కలెక్టర్ రూమ్లో బంధించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేశారు. అయితే, దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఎమ్మెల్యే మద్దతురాలు ఎంపీకి గట్టి వార్నింగ్ ఇచ్చారు.