వైఎస్ఆర్ సిపి అధినేత వై.ఎస్.జగన్మోహన రెడ్డికి పార్టీ ఎమ్మెల్యేలు దెబ్బ దెబ్బ కొడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు గోడ దూకితే తాజా బొబ్బిలి ఎమ్మెల్యే రంగారావు ఆ దిశగా పయనిస్తున్నారు.
హైదరాబాద్ లో పార్టీ ముఖ్య నేతలతో చర్చించిన ఆయన పలు అంశాలపై ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆయన హుటాహుటిన బుధవారం సాయంత్రం బొబ్బిలి చేరుకుని అందుబాటులో ఉన్న తన సహచరులతో మంతనాలు జరుపుతున్నారు. వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. గతంలో కూడా ఆయన పార్టీ మారతారని వార్తలొచ్చాయి.
పార్టీలోకి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి చేరిన సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ చేరికను ఆయన అంగీకరించలేదు. అయినా బొత్సా పార్టీలో చేరారు. దీంతో రంగారావు తీవ్ర మనస్తాపం చెంది పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. జగన్ వద్దని వారించినా ఆయన వినే పరిస్ధితిలో లేరని ఎమ్మెల్యే అనుచరులు చెబుతున్నారు.