రాష్ట్రంలో ఉన్న ప్రజా సమస్యలు, అర్హులైన వారికి ప్రభుత్వం అందిస్తున్న పథకాలుగురించి అధికారులతో సదస్సు నిర్వహిస్తుంటారు. కలెక్టర్లు, ఎస్పీలను రెండు రోజుల పాటు సదస్సులని పిలవటం తల వాచిపోయేట్లు గంటల తరబడి చెప్పిందే చెప్పి పంపటం. ఎంతసేపూ తన పనితీరు బ్రహ్మాండమని డప్పేసుకోవటం, ఒకళ్ళో ఇద్దరు మంత్రులను అందరి ముందు ఘాటుగా మాట్లాడటం పెద్ద ప్రహసనమైపోయింది. ఇదేదొ నేనొక్కడినే నిప్పు అన్నట్లు వాయించేస్తుంటారు.
మొత్తానికైతె చంద్రబాబునాయుడు రెండు రోజుల వన్ సైడ్ బ్యాటింగ్ అయిపోయింది. గడచిన మూడున్నరేళ్ళుగా కలెక్టర్లు, ఎస్పీలతో పాటు ఇతర ఉన్నతాధికారులకు ఈ సదస్సులు తలనొప్పిగా మారాయి. ఎంతసేపు తాను మాట్లాడటమే కానీ ఎదుటి వారికి మాట్లాడే అవకాశం మాత్రం చంద్రబాబు ఇవ్వరు.
రెండు రోజుల్లో అనేక అంశాలపై చంద్రబాబు సుదీర్ఘంగా ఉపన్యాసాలిచ్చారు. క్షేత్రస్ధాయిలో ఏమి జరుగుతోందో అన్న విషయాలను వివరించటానికి కలెక్టర్లకు గానీ ఎస్పీలకు గానీ ఇపుడు కూడా అవకాశం రాలేదు. చంద్రబాబు చెప్పింది విన్నారు సదస్సు అయిపోయిందనగానే బ్రతుకుజీవుడా అంటూ ఊపిరిపీల్చుకున్నారు.
నిజానికి చంద్రబాబు వినదలుచుకుంటే క్షేత్రస్ధాయిలో చాలా సమస్యలే ఉన్నాయి. రెండు రోజుల సదస్సు నిర్వహించినపుడు క్షత్రస్ధాయిలో పనిచేసే కలెక్టర్లు, ఎస్పీలనే మాట్లాడించాలి. అందరూ మాట్లాడిన తర్వాత వారికి దిశానిర్దేశం చేస్తే బాగుంటుంది. సమస్యలను వినటానికి చంద్రబాబు ఎప్పుడూ ఇష్టపడరన్న విషయం అందరికీ తెలిసిందే. అర్హులైన పేదలకందరికీ సంక్షేమ పథకాలు అందాలట. కామిడీ కాకపోతే లబ్దిదారుల ఎంపిక జన్మభూమి కమిటీలకు కట్టబెట్టిన తర్వాత అర్హులందరికీ లబ్ది ఎలా అందుతుంది.
ఎదుటివారితో గంటల తరబడి మాట్లాడటమన్నది చంద్రబాబు బలహీనత. విషయం లేకపోయినా ఎంతసేపన్నా మాట్లాడటం కూడా ఓ కళే. అందులో చంద్రబాబు పిహెచ్ డి ఎప్పుడో చేశారని సెటైర్లు వినిపిస్తున్నాయి.