ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు మెగాస్టార్ చిరంజీవి మండిపడ్డారు. ఆయన కాపుల మధ్య చిచ్చు పెట్టి తన పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారని అన్నారు. కాపుల అంశంపై చిరంజీవి ఓ లేఖ విడుదల చేశారు.
తుని ఘటనను అడ్డం పెట్టుకుని అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని, అయితే ఆ సంఘటనను ఎవరూ సమర్ధించకపోయినా అందుకు బాధ్యులైన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని అన్నారు. తుని ఘటనలో గోదావరి జిల్లాలకు చెందిన వారు ఎవరూ లేరని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ జిల్లాలకు చెందిన వారిని ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. సున్నితమైన అంశంలో రాజకీయ పరిణితితో వ్యవహరించాల్సిన చంద్రబాబు నాయుడు కక్ష సాధింపు చర్యగా వ్యవహరించడం దారుణమన్నారు. కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం పట్ల ముందు నుంచి చంద్రబాబు, ఆయన ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు ఘర్షణాత్మకంగానే ఉందని చిరంజీవి లేఖలో పేర్కొన్నారు.
ముద్రగడ చేస్తున్న దీక్షకు రాజకీయాలను ఆపాదించి సమస్యను పక్కదారి పట్టిస్తున్నారని ఆయన అన్నారు. ఈ సంఘటనపై ఇప్పటికైనా సరిగా ఆలోచించి పరిష్కరించాలని చిరంజీవి సూచించారు. తుని సంఘటనకు బాధ్యులైన వారిని సిబిఐ విచారణ తర్వాతే గుర్తించి అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.