కడప ఉక్కు కర్మాగారానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూమి పూజ చేశారు . జిల్లాలోని మైలవరం మండలం కంబాలదిన్నె గ్రామ పొలాల్లో ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. రాయలసీమ వాసుల చిరకాల స్వప్నం నెరవేరనుంది.
రూ.18వేల కోట్ల పెట్టుబడితో మూడు మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ స్టీల్ ప్లాంట్ ను నిర్మించనున్నట్లు చంద్రబాబు తెలిపారు. విభజన చట్టంలో కడపకు స్టీల్ ప్లాంట్ పరిశ్రమ ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు దాన్ని పట్టించుకోక పోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే నిర్మాణం చేపట్టింది.
ఏళ్ల తరబడి సీమవాసుల ఆకాంక్షగా ఉన్న ఉక్కు పరిశ్రమను చంద్రబాబు శంకుస్థాపన చెయ్యడంతో రాయలసీమ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రారంభోత్సవ వేడుకలో రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి సుజయ్ కృష్ణ రంగరావు, జిల్లా మంత్రి ఆదినారాయణ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, టీడీపీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.