సినిమా పరిశ్రమలో ప్రతిసారీ ఏదో ఒక లొల్లి నడుస్తూనే ఉంటది. అది ఏ భాష సినిమానైనా తరచూ ఏదో ఒక వివాదం రగులుతూనే ఉంటది. ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమను అవార్డుల లొల్లి కుదిపేస్తోంది. ఇది సినీ పరిశ్రమనే కాకుండా రాజకీయంగానూ కాక పుట్టిస్తోంది. తమ బంధుత్వం, అభిమానంతోనే అవార్డులు ప్రకటించారని ఎక్కడ చూసినా ఇదే చర్చ.
ఈ చర్చ రచ్చ చేస్తోంది. అసలు అవార్డులు ఏ ప్రాతిపదికన ఇస్తారని ప్రజలు, అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్న ఏ తెలుగు అభిమానిదే కాదు యావత్ దేశమంతా వస్తున్న ప్రశ్న. హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ సినీ పరిశ్రమల్లో కూడా ఇదే ప్రశ్న కొనసాగుతోంది. తాజాగా ఈ వివాదానికి ఆజ్యం పోసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులు. రాష్ర్ట విభజన తర్వాత పాలన కుదుటపడి, అన్ని శాఖలు విభజించడానికి సమయం తీసుకోవడంతో మూడేళ్లుగా నంది అవార్డులు ప్రకటించలేదు. ఇప్పుడు ప్రకటించిన అవార్డులతో లొల్లి షురువైంది. ఈ లొల్లి జాతీయ స్థాయి అవార్డులను మొదలుకొని నాటక స్థాయ అవార్డుల వరకు పాకింది. ఈ లొల్లి రగులుతోంది. ఈ వివాదాల గురించి తెలుసుకుందాం.
కొనసాగుతున్న ఆజ్యం
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ అవార్డులు తీవ్ర దుమారం రేపాయి. జాతీయ ఉత్తమ నటుడిగా అక్షయ్కుమార్ ఎంపికపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అవార్డుల కమిటీలోని సభ్యులకు తెలిసిన వ్యక్తి అని అక్షయ్కుమార్కు అవార్డు ప్రకటించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అదే విధంగా కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నాడనే సమాచారంతో ఎంపిక చేశారని విమర్శలు వచ్చాయి. అక్షయ్కుమార్ నటించిన రుస్తుం సినిమాకు ఈ అవార్డు లభించింది.
అదే సమయంలో సల్మాన్ఖాన్ నటించిన బజరంగీ భాయిజాన్, అమీర్ఖాన్ నటించిన పీకే తదితర చిత్రాలు విడుదలయ్యాయి. ప్రేక్షకుల మది దోచడమే కాక మంచి సందేశం, కలెక్షన్ల వర్షం కురిశాయి. వాటన్నింటిని వదిలేసి అక్షయ్కుమార్ను ఎంపిక చేయడంపై సినీ వర్గం కూడా గుర్రుమంది. అమీర్ఖాన్ అయితే అసహనం అనే అంశంపై మాట్లాడడంతో అవార్డు ప్రకటించలేదు అనుకుందాం. మరీ సల్మాన్ఖాన్కు ఇవ్వకపోవడం ఆశ్చర్యమనిపించింది. అదే ప్రతిభకు పట్టం కట్టకుండా బంధుత్వం, అభిమానం తదితర కొలమానాలుగా అవార్డులు ప్రకటిస్తున్నారు.
బంధుత్వానికే మొగ్గు
ఇదే ముచ్చట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన అవార్డుల్లో జరిగింది. లెజెండ్ సినిమాకు ఉత్తమ నటుడిగా బాలకృష్ణ, పైగా ఆ చిత్రానికి మరో 6 అవార్డులు దక్కడంపై విమర్శలు తీవ్రంగా వస్తున్నాయి. ఒక హింసాపూరితంగా ఉన్న సినిమాకు ఎలా ఉత్తమ చిత్రం, క్యారీ బ్యాగ్లు వేసుకొని నటించే నటుడికి ఉత్తమ నటుడిగా ఎంపిక చేయడంపై తెలుగు సినీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభుత్వం నడిపే నాయకులకు బంధువులైతే అవార్డులు గంపగుత్తగా అప్పగిస్తారా అని ప్రశ్నిస్తున్నారు.
ఆ సమయంలో వచ్చిన మనం చిత్రాన్ని పట్టించుకోకపోవడం మరీ దారుణంగా వర్ణిస్తున్నారు. తెలుగులో వచ్చిన ఓ అరుదైన చిత్రంగా గుర్తింపు తెచ్చుకున్న ‘మనం’ సినిమాను 2014 కాలానికి ఉత్తమ ద్వితీయ చిత్రంగా ఎంపిక చేయడం మింగుడు పడని విషయం. ఒక కుటుంబ కథా చిత్రం, పైగా నట విఖ్యాత అక్కినేని నాగేశ్వర్ రావు నటించిన ఆఖరు చిత్రం మనం సినిమాను ఎంపిక కాకపోవడం గమనార్హం. కనీసం పెద్దాయన గౌరవార్థం అయినా ఆ సినిమాను లెక్కలోకి తీసుకోలేదు. ఈ విధంగా సినీ అవార్డులపై ఎప్పుడూ విమర్శలు వస్తుంటాయి. కానీ ఇంత తీవ్రంగా ఏనాడూ రాలేదు. ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ అవార్డులు ప్రకటించాలి. అవి వస్తే ఇంకెంత రచ్చ జరుగుతుందో.
